హైకోర్టు జడ్జీలపై సోషల్ పోస్టులు- కుట్రకోణంపై సీబీఐ ఆరా- వంతపాడి చిక్కుల్లో వైసీపీ
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ మొదట్లో చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఆ తర్వాత గుంటూరుకు చెందిన లాయర్ లక్ష్మీనారాయణ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఆయా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సీఐడీ దర్యాప్తు జరిగినా నిందితులను గుర్తించడంలో విఫలం కావడంతో హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో కుట్రకోణాన్ని తెల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.
సోషల్ పోస్టులపై సీబీ"ఐ"
ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసులను తన పరిధిలోకి తీసుకున్న సీబీఐ అధికారులు తొలుత విశాఖలో దర్యాప్తు నిర్వహించారు. ఇక్కడ సీబీఐ తాజాగా మొత్తం 12 కేసులు నమోదు చేసింది. విశాఖలో నిందితుల విచారణ తర్వాత విజయవాడ చేరుకున్న సీబీఐ టీమ్.. పిటిషనర్ లక్ష్మీనారాయణను ముందుగా పిలిపించింది. ఇందులో కుట్ర కోణం ఉందంటూ పిటిషన్లో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆయన్ను కోరింది. దీంతో సీబీఐ విచారణకు హాజరైన లక్ష్మీనారాయణ ఈ వ్యవహారంలో చోటు చేసుకున్న పలు పరిణామాలను సీబీఐ ముందు ఉంచారు. హైకోర్టు తీర్పులపై వైసీపీ ప్రభుత్వ సాయంతో నిందితులు ఎలా పోస్టులు పెట్టారో వివరించారు.
కుట్ర కోణంపై సీబీఐ నజర్...
హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై వారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వెలిసిన పోస్టుల వెనుక ఎవరున్నారు ? అవన్నీ ఒకే చోటి నుంచి సోషల్ మీడియాలోకి పోస్ట్ అయ్యాయా ? వీటిని పెట్టిన వారు ఒకే ప్రాంతానికి చెందిన వారా ? అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని కుట్రగా చెప్పేందుకు మీ వద్దనున్న ఆధారాలేంటని సీబీఐ అధికారులు లక్ష్మీనారాయణను ప్రశ్నించారు. దీంతో లక్ష్మీనారాయణ తన వద్ద నున్న అన్ని ఆధారాలను సీబీఐకి సమర్పించారు. వీటి ఆధారంగానే కుట్ర కోణం విషయంలో సీబీఐ అధికారులు పిటిషనర్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Recommended Video
నిందితులకు మద్దతుతో చిక్కుల్లో వైసీపీ...
సీబీఐ దర్యాప్తులో పిటిషనర్ లక్ష్మీనారాయణ వైసీపీకి చెందిన పలువురు నేతలు, ప్రభుత్వంలో ఉన్నవారు, చివరికి స్పీకర్ తమ్మినేని పలు సందర్భాల్లో హైకోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను సీబీఐ దృష్టికి తెచ్చారు. ఇందులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబుతో పాటు వైసీపీ ఎన్నారై విభాగం ప్రతినిధి పంచ్ ప్రభాకర్ వంటి వారు హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలున్నాయి. ఇవన్నీ నిందితులకు మద్దతుగా వీరు చేసినవే అనే అంశాన్ని పిటిషనర్ సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. వీటి వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ నేతల అండతోనే వీరంతా ఈ పోస్టులు పెట్టారా అన్న నిర్ణయానికి సీబీఐ రావాల్సి ఉంది. అదే జరిగితే వీరందరికీ కష్టాలు తప్పవు.