జగన్,సాయిరెడ్డి విదేశీ టూర్లకు సీబీఐ అడ్డుపుల్ల-కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే నెలలో వెళ్లాల్సిన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇవాళ వాదనలు ముగిశాయి. ఇద్దరూ దాఖలు చేసుకున్న రెండు వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు తమ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. అయితే ఈ రెండు పిటిషన్లపైనా తమ వాదన వినిపించిన సీబీఐ.. ఇద్దరి విదేశీ టూర్లకు అనుమతిపైనా అభ్యంతరాలు తెలిపింది.
వచ్చే నెలలో బ్రిటన్ లో పర్యటించేందుకు సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టును అనుమతి కోరారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సీఎం జగన్.. బెయిల్ షరతుల్లో భాగంగా విదేశీ టూర్లు వెళ్లకూడదంటూ సీబీఐ కోర్టు ఆదేశించడంతో దీన్ని సడలించాలని కోరారు. దీనిపై సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కోరింది. గత విచారణ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కోరిన సీబీఐ...ఇవాళ తన అభిప్రాయం చెప్పేసింది. జగన్ విదేశీ టూర్ కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది.

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివిధ యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం వచ్చే ఆరు నెలల్లో యూఎస్, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. అయితే దీనిపైనా సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్ పైనా ఇవాళ సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో సీబీఐ కోర్టు తమ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.
గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ తో పాటు విజయసాయిరెడ్డికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే సందర్భంలో సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటనలు చేయాలనే షరతు కూడా ఒకటి. దీంతో గతంలో ఓసారి విజయసాయిరెడ్డి కోర్టు అనుమతి తీసుకుని విదేశీ టూర్ కు వెళ్లారు. ఇప్పుడు మరోసారి సాయిరెడ్డితో పాటు జగన్ కూడా విదేశీ టూర్లకు అనుమతి కోరారు. ఈసారి సీబీఐ అభ్యంతరాల నేపథ్యంలో రేపు కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications