న్యాయమూర్తులపై సోషల్ మీడియా పోస్టులు- ఏపీలో 16 మందిపై సీబీఐ కేసులు- హైకోర్టు ఆదేశాలతో..
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో వెలువడిన పలు తీర్పులను దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వ్యవహారాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో తొలుత సీఐడీని కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోక పోవడంతో సీబీఐ దర్యాప్తుకు గత నెల 12న ఆదేశాలు ఇచ్చింది.
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో 16 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించిన సీబీఐ అధికారులు... విశాఖలో 12 మందిపై కేసులు నమోదు చేశారు. మిగతా కేసులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యక్తులపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సీబీఐ రంగంలోకి దిగి వైసీపీ సానుభూతి పరులుగా భావిస్తున్న వీరిపై కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం కీలకంగా మారింది.
ఏపీ హైకోర్టు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తున్న తీర్పులపై సోషల్ మీడీయాలో వందల కొద్దీ అనుచిత కామెంట్లు దర్శనమిచ్చాయి. వీటిపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన హైకోర్టు.. సీఐడీ కేసులు నమోదు చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ 98 మందిని గుర్తించినప్పటికీ కేవలం 18 మందిపైనే కేసులు నమోదు చేసింది. దీన్ని సవాలు చేస్తూ శివానందరెడ్డి అనే మాజీ పోలీసు అధికారి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఐడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ కేసులు నమోదు చేస్తోంది.