స్మశాన వాటికకు వైసీపీ రంగులు .. ఫైర్ అయిన ఎంపీ కేశినేని నానీ
టిడిపి ఎంపీ కేశినేని నాని ఎన్నికల ఫలితాల తర్వాత నుండి సోషల్ మీడియా వేదికగా అటు సొంత పార్టీ నేతలపై, ఇటు వైసీపీపై మండిపడుతున్నారు. జగన్ సర్కార్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న కేశినేని నాని అధికారి వైసిపి తీసుకునే నిర్ణయాలలో తప్పులను ఎత్తి చూపుతున్నారు. అందులో భాగంగా తాజాగా ట్వీట్ చేసిన నానీ స్మశానాలపై సైతం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
స్మశాన వాటిక గోడలకు సైతం వైసీపీకి చెందిన రంగులు వేయడాన్ని ఆయన విమర్శించారు. చివరకు శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా? అంటూ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన చేసిన ట్వీట్ లో ''శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా?...శ్మశాన వాటిక గోడలకు వైసీపీ రంగులా? పల్నాడులో శ్మశానం గోడకు, చిన్న గదికి, ఆర్చ్కు కూడా వైసీపీ రంగులు వేస్తారా?...దేన్నీ మీరు వదలరా?'' అని నాని సోషల్ మీడియాలో సదరు ఫోటోలు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని ట్వీట్ తో స్మశాన వాటికలకు సైతం వైసిపి పార్టీ రంగులు వేస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కేశినేని నాని చేసిన పోస్టులతో టిడిపి శ్రేణుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. స్మశానం వరకు పార్టీ రంగులేసే రాజకీయం ఏంటి అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పాలన పక్కనపెట్టి, పార్టీ ప్రచారం కోసం వెంపర్లాట అవసరమా అని మండిపడుతున్నారు.