ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్; రూ.4,721 కోట్ల నిధులు విడుదల.. దేనికంటే!!
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల వాటా నిధులను విడుదల చేసింది కేంద్రం. ఆయా రాష్ట్రాల నుండి జిఎస్టి రూపంలో వసూలు చేసిన పన్నులలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాటాను విడుదల చేసింది. తాజాగా రెండో విడత రాష్ట్రాలవాటా నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4721 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

రాష్ట్రాల పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం
తొలి వాటా కింద రూ.58,332.86 కోట్ల విడుదలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం రెండు విడతలు కలిపి రూ.1,16,665.75 కోట్ల పన్నుల పంపిణీని రాష్ట్రాలకు విడుదల చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా రూ. 20,928.62 కోట్లు, బీహార్కు రూ. 11,734.22 కోట్లు వచ్చాయి. ఇది రాష్ట్రాలు తమ మూలధనం మరియు అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే భారత ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఏపీకి రూ.4,721.44 కోట్లు విడుదల
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,721.44 కోట్లు విడుదల చేయగా, తెలంగాణ రాష్ట్రానికి 2452 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయి. ఛత్తీస్గఢ్కు రూ.3,974.82 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.9,158.24 కోట్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు విడతల పన్నుల పంపిణీలో రూ.8,776.76 కోట్లు నిధులు విడుదల అయ్యాయి . ఇక గుజరాత్కు రూ.4,057.64 కోట్లు, హర్యానాకు రూ. 1,275.14 కోట్లు,మహారాష్ట్రకు రూ.7,369.76 కోట్లు, రాజస్థాన్కు రూ.7,030.28 కోట్లు, తమిళనాడుకు రూ.4,758.78 కోట్లు నిధులు విడుదల అయినట్లుగా తెలుస్తుంది.

కేంద్రం వద్ద పెండింగ్ నిధులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఇవ్వవలసిన అనేక నిధులు ఏడాది కాలంగా పెండింగ్ ఉన్నాయని పేర్కొంది. స్థానిక సంస్థలకు ఇంతవరకూ గత ఏడాది రెండో విడత 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు 678.65 కోట్లు, మండల జిల్లా పరిషత్ లకు 290. 86 కోట్లు మొత్తంగా బకాయిలు 969 కోట్ల రూపాయలు విడుదల కాలేదని పేర్కొంది. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో వెయ్యి కోట్లు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నిధులను ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications