జగన్ పై విమర్శలు కాదు చర్యలెప్పుడు ? చంద్రబాబు ప్రశ్న- కుప్పం నుంచే మ్యానిఫెస్టో అమలు హామీ..
ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల గడువు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓవైపు టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తుండగా.. మరోవైపు అధినేత చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టో అమలుకు హామీ ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్నారు. సీఎం అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలన్నారు.

కుప్పంలో గ్రానైట్ డోపిడి చేస్తున్నారు, టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా...ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. సందప సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తామన్నారు. ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
మైనార్టీకు జగన్ ప్రత్యేకంగా పధకాలు తీసుకురాకపోగా రంజాన్ తోఫా వంటి పధకాలు రద్దు చేశారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. 35 ఏళ్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు సీఎం, 13 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న నాకు ఇళ్లు కట్టుకోవడానికి అనుమతివ్వడంట ఈ తుగ్లక్ అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం జగన్ తాత జాగీరా ? రాష్ట్రాన్ని రౌడీలకు నిలయంగా మార్చారని ఆక్షేపించారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీలతో బెదిరిస్తున్నారని, రౌడీలను అణిచివేసే భాద్యత తనదని చంద్రబాబు తెలిపారు. అన్ని లెక్కపెడుతున్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని వదిలేది లేదన్నారు.












Click it and Unblock the Notifications