Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై దెబ్బ మీద దెబ్బ: ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలు అలా ఉండగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఉన్న సమస్యలకు మరిన్ని సమస్యలు తోడై ఆయన చిక్కుల్లో పడుతున్నారు. సమస్యలు చుట్టుముడుతుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు వల్ల ఆయన వ్యక్తిత్వంపై మచ్చ పడింది. ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు హస్తం ఉందంటూ తలెత్తిన అభియోగాలు ఆయన ప్రతిష్టను దెబ్బ తీసిన మాటను కాదనలేం. ఇకపోతే, గతనెల 14న రాజమండ్రిలో మహావైభవంగా గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజునే తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పి నాలుగు వారాలు గడుస్తున్నా, ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.

అదలా ఉండగానే, రుషితేశ్వరి సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్ట్ కోర్సు మొదటి ఏడాది చదువుతున్న రుషితేశ్వరి ర్యాగింగ్ భూతానికి బలైంది. సంఘటన చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసిందనే చెప్పాలి. విపక్షాల ఆందోళనతో మెట్టుదిగిన ప్రభుత్వం కమిటీని నియమించింది. బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చింది.

Chandrababu faces troubles in Andhra Pradesh

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి కనీసం కొన్ని ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరుకు తరలించాలని ఏడాదినుంచి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ఇంతవరకు అగ్నిమాపక శాఖ మినహాయించి మరే శాఖనూ తరలించ లేకపోయింది. ఇంతవరకు మూడు కమిటీలను ప్రభుత్వం నియమించింది. తాజాగా జవహర్‌రెడ్డి కమిటీని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలను పిలిపించి మాట్లాడారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకు బదిలీ చేస్తే సహించబోమని, పైగా స్థానికత అంశం తమను వేధిస్తోందని, వసతి సదుపాయాలు విజయవాడ, గుంటూరులో లేవని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. విజయవాడ, గుంటూరులో అందుబాటులో ఉన్న భవన సముదాయాలకు కనీసం కొన్ని శాఖలను తరలించి, ఉద్యోగులను బదిలీ చేసే విషయంలో కూడా చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు దృఢంగా వ్యవహరించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. ప్రత్యేక హోదా కోసం మునికోటి అనే కాంగ్రెసు కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సమస్య తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

చంద్రబాబును సమస్యలు పట్టిపీడిస్తున్నా ప్రతిపక్షాలు వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఇది కొంత వరకు చంద్రబాబుకు ఊరట కలిగించే విషయం. అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కడం చంద్రబాబుకు పరీక్షనే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+