తెలుగు అకాడమీని తెలుగుదేశం అకాడమీ అనుకున్నారా.. చంద్రబాబు ఫైర్, లక్ష్మీ పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అకాడమీ పేరు మారుస్తూ తెలుగు సంస్కృత అకాడమీ గా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రెండు రోజులుగా రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగు అకాడమీని లేకుండా చేయడం కోసం జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని తెలుగు తమ్ముళ్లు దీనిపై ధ్వజమెత్తుతున్నారు. తెలుగు అకాడమీ పేరు మార్పు పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
కేజీ నుండి పీజీ వరకు తెలుగు మాధ్యమాన్ని దూరం చేస్తున్నారని చంద్రబాబు ఫైర్
తాజాగా తెలుగు అకాడమీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ పేరు మార్చు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తన అసహనాన్ని వ్యక్తం చేశారు . తెలుగు అకాడమీని తెలుగు దేశం అకాడమీ అనుకున్నారేమో కేజీ నుండి పీజీ వరకు తెలుగు మాధ్యమాన్ని దూరం చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. భాషాభివృద్ధికి 1968 నుండి తెలుగు అకాడమీ కృషి చేస్తోంది అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలుగు భాషా వికాసం పై కూడా మీ రివర్స్ కన్ను
తెలుగు భాషా వికాసం పై కూడా మీ రివర్స్ కన్ను పడిందని ఒక తెలుగువాడిగా బాధపడుతున్నాను అంటూ చంద్రబాబు తెలుగు అకాడమీ విషయంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇక తెలుగు అకాడమీ పేరు మార్పు పై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, శాసనసభ మాజీ ఉపసభాపతి, టిడిపి సీనియర్ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.
తెలుగు అకాడమీ పేరు మార్పుపై భగ్గుమన్న పవన్ కళ్యాణ్ , మండలి బుద్ధ ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరు మార్చి ఏం సాధిస్తుందని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అసలు పేరు మార్చాల్సిన నిర్ణయం వెనుక కారణం ఏంటో చెప్పాలని నిలదీశారు. తెలుగు భాష అస్తిత్వాన్ని కాపాడడం కోసం భాషాభిమానులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇక తెలుగును చంపడానికే వచ్చారా అంటూ వైసిపి సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మండలి బుద్ధ ప్రసాద్. అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగు ను నిర్వీర్యం చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు వ్యతిరేక ప్రభుత్వం గా వ్యవహరించడం మంచిది కాదన్నారు. తెలుగు అకాడమీ పై తాజాగా తీసుకున్న నిర్ణయంతో జగన్ పై, ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది.
Recommended Video
విమర్శలకు లక్ష్మీ పార్వతి స్ట్రాంగ్ కౌంటర్
ఇక తాజాగా తెలుగు అకాడమీ పేరును ఎలా మారుస్తారు అంటూ జగన్ సర్కార్ పై వస్తున్న విమర్శలపై తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తనదైన శైలిలో స్పందించారు. తెలుగు సంస్కృతి అకాడమీ ఏర్పాటు తప్పేంటని ఏపీలోని విపక్షాలని నిలదీసిన ఆమె అసలు తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీ గా మార్చడంతో వచ్చిన నష్టం ఏంటో వివరించాలని ఆమె ప్రతిపక్షాలను డిమాండ్ చేశారు.
తెలుగు భాషాభివృద్ధికి మాత్రమే కాకుండా సంస్కృత భాషాభివృద్ధికి కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ కొనియాడాల్సింది పోయి, అకారణమైన నిర్హేతుకమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసంబద్ధమైన విమర్శలు చేయవద్దని సవినయంగా మనవి చేస్తున్నా అని పేర్కొన్నారు లక్ష్మీపార్వతి.