తుని ఘటన, పులివెందుల: జగన్పై రెచ్చిపోయిన చంద్రబాబు
తిరుపతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆయన పేరు ప్రస్తావించకుండా రెచ్చిపోయారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు గర్జన సందర్భంగా తునిలో చెలరేగిన విధ్వంసాన్ని, పులివెందులలో పరిస్థితిని ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మహానాడులో శాంతిభద్రతలపై పరిస్థితిపై ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. తునిలో పకడ్బందీగా హింసుకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కావాలని, కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికలో పెట్టి కూడా వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదని, అటువంటి వైయస్ రాజశేఖర రెడ్డిని దేవుడితో పోల్చే స్థితికి వచ్చారని ఆయన ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి అన్నారు.
నిరసన అంటే ఏదో మామాలుగా చేస్తారని అనుకున్నానని, కానీ తునిలో దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటనలు జరిగాయని, రైలును ఆపేసి తగులబెట్టారని, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని, రాష్ట్రంలో అభద్రతా భావం ఏర్పడిందని అన్నారు. ఆ ఘటన వెనక వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు ఉన్నాడని, మనుషులను పంపించి రైలును తగులబెట్టించారని తాను ఆ రోజు రాత్రే చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు.
పులివెందులలో జగన్ ప్రజలు ఓట్లు వేస్తే గెలవడం లేదని, పులివెందులలో రౌడీయిజం చేసి గెలుస్తున్నారని, ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తారని ఆయన అన్నారు. కుప్పంలో తాను యాబై వేల మెజారిటీతో గెలుస్తున్నానని, ఏడాదికి ఓసారి అక్కడికి వెళ్తానని ఆయన అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. సున్నితమైన సమస్యలపై ఆందోళనలు జరిగితే వాటిని రాజకీయంగా వాడుకోవడానికి అరచాకాలు చేయాలని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.
కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్యాయం జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. విద్రోహ శక్తుల సాయం తీసుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, అటువంటివాటిని సహించబోమని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను బెదిరిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇష్టానుసారంగా బరి తెగిస్తున్నారని, విజయవాడలో మహిళలపై అరాచాకాలను చూశామని, కాల్ మనీ మనకు వారసత్వంగా వచ్చిందని, ఎంత గోప్పవాళ్లయినా చట్టం ముందు అందరూ ఒక్కటేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రౌడీలుు రాష్ట్రం వదిలిపెట్టిపోయారని, అదే పరిస్థితిని ఇప్పుడు కూడా తెస్తామని ఆయన చెప్పారు.