ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: అక్కడే జగన్ ఇరుకునపడ్డారని చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ భూముల్లో 100 గజాల లోపు ఇళ్లు కట్టుకున్న వారికి భూమిని క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.
చుక్కల భూముల అనుభవదారులను గుర్తించి వెంటనే హక్కు కల్పించేందుకు చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మృతదేహాలు తీసుకు వెళ్లేందుకు ఏసీ అంబులెన్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 'బసనతారకం మదర్ కిట్' పేరుతో బాలింతలకు కిట్లు ఇవ్వనున్నారు. కిట్లో ప్లాస్క్, శానిటరీ ప్యాడ్స్, ఇతర వస్తువులు ఉంటాయి.
కేంద్రం రూపొందించిన రియల్ ఎస్టేట్ కార్మిక చట్టాలకు అనుగుణంగా ఏపీలోను చట్టాలు చేయాలని నిర్ణయించారు. ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలను వెంటనే ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు.

అక్వా యూనివర్సిటీ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించింది. పీపీపీ పద్ధతిలో ఫిషరీస్ అండ్ ఓషన్ యూనివర్సిటీపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తారు. 50 ఎకరాల్లో రూ.300 కోట్లతో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
చెన్నైకి చెందిన లక్ష్మీ అమ్మాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 150 ఎకరాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సభలో ప్రతిజ్ఞ సమయంలో.. వైసిపి ఇరకాటంలో పడింది
సభలో ప్రతిజ్ఞ సమయంలో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతిజ్ఞ సమయంలో స్పీకర్ కూడా నిలబడ్డారని, వైసిపి నిలబడక పోవడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం స్పీకర్ చైర్ను అవమానించినట్లేనని, దీంతో వైసిపి ఇరకాటంలో పడిందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications