స్వర్ణవార్డు, స్వర్ణగ్రామాల ఉద్యోగుల్ని ఇకపై ఇలా.. సీఎం కీలక ఆదేశాలు..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పేర్లు మార్చి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలుగా మార్చినా వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రభుత్వం ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర నిర్వహణ చేపడుతున్నా కొన్ని ప్రాంతాల్లో సీరియస్ నెస్ రావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. పని విభజన చేసుకుని, అవసరాన్ని బట్టి స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలన్నారు. ఇటీవల కాకినాడ, సామర్ల కోట లాంటి పట్టణాల్లో పర్యటించినప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించిందని చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.

స్వర్ణ గ్రామ, వార్డుల్లో మహిళా పోలీసుల సేవలను ఎవరూ వినియోగించుకోవటం లేదని, వారి సేవలను అవసరమున్న శాఖలు వినియోగించుకోవాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ఆర్ అండ్ బి, హెల్త్, మున్సిపల్ శాఖలకు వీరి ఎక్కువగా అవసరం ఉన్నట్టుగా చెబుతున్నారని తెలిపారు. స్వర్ణ, గ్రామ, వార్డు కార్యాలయాల్లోని సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా.. ఆ మేరకు సర్దుబాటు చేసుకునేలా కలెక్టర్లకు అధికారాలిస్తున్నామని తెలిపారు. స్వర్ణవార్డు, గ్రామ సిబ్బంది బదిలీలు సిఫార్సుల ఆధారంగా కాదు, అవసరానికి అనుగుణంగానే జరగాలన్నారు. రేషనలైజేషన్ ప్రకారమే ఈ బదిలీలు జరగాలన్నారు.












Click it and Unblock the Notifications