కొడాలిపై టీడీపీ అభ్యర్ధి ఫైనల్ ? చంద్రబాబు ఛాయిస్ ఇదే ! మాజీ మంత్రి సవాళ్లు అందుకేనా !
ఏపీలో రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తిరేపే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా గుడివాడ కూడా ఒకటి. గతంలో మహామహులెందరో పోటీ చేసి గెలిచిన ఈ నియోజకవర్గంలో గత నాలుగుసార్లు కొడాలి నాని జైత్రయాత్ర సాగిస్తున్నారు. ఇందులో రెండుసార్లు టీడీపీ నుంచి మరో రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఈ జైత్రయాత్రకు బ్రేక్ వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ ఈసారి మరో కొత్త వ్యూహం రచిస్తోంది. దీన్ని గమనించిన కొడాలి నాని.. సవాళ్లు మొదలుపెట్టేశారు.

గుడివాడ రాజకీయమా మజాకా ?
గుడివాడ అసెంబ్లీ సీటులో ఈసారి కొడాలి నానిని కొట్టాలంటే ఏ స్ధాయి అభ్యర్ధి కావాలో వెతుక్కుంటున్న టీడీపీ పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న రావి వెంకటేశ్వరరావును బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ..ఆయన్ను ఇన్ ఛార్జ్ గా ఎప్పుడో ప్రకటించింది. అయితే రావి వెంకటేశ్వరరావుతో కొడాలి వెంకటేశ్వరరావు(నాని)ని ఢీకొట్టాలంటే సరిపోరనే భావన టీడీపీలో ఎక్కడో కనిపిస్తోంది. అసలే నాలుగుసార్లు గెలిచి ఊపుమీదున్న నానిని ఈసారి కొట్టాలంటే రావి వెంకటేశ్వరరావు కంటే బలమైన అభ్యర్ధి కావాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త అభ్యర్ధులు తెరపైకి వస్తున్నారు.

ఎన్నారై వెనిగండ్ల రాము
కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో కొడాలి నాని వంటి అభ్యర్ధిని ఢీకొట్టాలంటే మళ్లీ అదే సామాజిక వర్గం కావాలి. ఆ లెక్కన రావి వెంకటేశ్వరరావు సరిపోతారు. కానీ అది సరిపోదు. ఆర్ధికంగా బలవంతులు కావాలి, అలాగే ఎన్నారైను బరిలోకి దించడం ద్వారా కొడాలి నాని బూతు పంచాంగాన్ని జనంలో ఎండగట్టేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ అర్హతలు ఉన్న ఎన్నారై వెనిగండ్ల రామును టీడీపీ రంగంలోకి దింపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే గుడివాడ రాజకీయాన్ని స్టడీ చేస్తున్న రాము.. త్వరలో నేరుగా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాము ఎందుకంటే ?
కొడాలి నానిపై టీడీపీ అభ్యర్ధిగా తెరపైకి వస్తున్న వెనిగండ్ల రాముకు విదేశాలతో పాటు కృష్ణాజిల్లాలోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడి కమ్మ సామాజిక వర్గ నేతలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతారని భావిస్తున్న కేశినేని శివనాథ్ (చిన్ని)తోనూ అనుబంధం ఉంది. ఇలా టీడీపీ నేతలతో ఉన్న అనుబంధం, కమ్మ సామాజిక వర్గంలో పలుకుబడి, ఆర్దికంగా బలవంతుడు కావడం ఆయనకు కలిసి రాబోతున్నాయి. గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను రంగంలోకి దించడం ద్వారా చేతులు కాల్చుకున్న చంద్రబాబు.. ఈసారి రామును బరిలోకి దింపడం ద్వారా కొడాలిని చిత్తు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

కొడాలి స్ట్రాంగ్ రియాక్షన్ !
గుడివాడలో తనను ఓడించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై తాజాగా కొడాలి నాని మరోసారి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, లోకేష్ వచ్చి పోటీ చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు గుడివాడలో డబ్బులు వెదజల్లినా ప్రత్యర్దులకు ఓట్లు మాత్రం పడవన్నారు. గుడివాడలో ఎవరిని గెలిపించాలో ఇక్కడి ప్రజలకు తెలుసని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మరోవైపు జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొడాలికి రెండో కేబినెట్లో స్ధానం దక్కలేదు. మంత్రి పదవి తీసేశాక రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ ను చేస్తానన్నా ఆయన ఒప్పుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆయన మరోసారి గెలిచేందుకు గుడివాడలో వ్యూహాలు రచిస్తున్నారు.












Click it and Unblock the Notifications