లోకేష్ యాత్రకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న చంద్రబాబు? పెద్దిరెడ్డితో మరో పోరు? వరుస టూర్ల వెనుక!
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ నెల 27న చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర యువగళం కోసం చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించాలే రూట్ మ్యాప్ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లాలో ఆ మేరకు అనుకూలమైన వాతావారణం ఏర్పడేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాత ప్రత్యర్ధి పెద్దిరెడ్డితో పోరుకు అమీతుమీ అంటున్నారు.
కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరుతో నారా లోకేష్ ఈ నెల 27న పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైంది. దీని ప్రకారం తొలి మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే యాత్ర సాగబోతోంది.
అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి యాత్ర వెళ్లబోతోంది. ఈ సమయంలో వైసీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ముందుగానే చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తరచుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
లోకేష్ యాత్రకు చంద్రబాబు ప్లాన్
లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్రకు ఆరంభంలోనే ఆటంకాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఆ జిల్లాలోనే వైసీపీ నుంచి గట్టి సవాల్ ఎదురుకాబోతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు టూర్లను అడ్డుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లేందుకు ప్రయత్నించినా వైసీపీ సర్కార్ పోలీసుల సాయంతో చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో రోడ్డుపై సాగే లోకేష్ పాదయాత్రకు సైతం ఆటంకాలు కల్పించే అవకాశం ఉందని అనుమానిస్తున్న చంద్రబాబు.. ఆ మేరకు టీడీపీ శ్రేణుల్ని ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరుస టూర్లతో చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసు కేసుల్ని సైతం లెక్కచేయొద్దని చెబుతున్నారు. అలాగే కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లిన వారిని కూడా స్వయంగా పరామర్శిస్తున్నారు. దీంతో మిగతా వారు కూడా భయపడే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
పెద్దిరెడ్డి సవాల్ కు చంద్రబాబు సై
అలాగే లోకేష్ పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వరుసగా చేపడుతున్న టూర్లలో మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డి సాయంతో చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డి విసురుతున్న సవాల్ ను ముందే ఎదుర్కొంటే లోకేష్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
కుప్పంలో సక్సెస్ అయితే..?
లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టే కుప్పంలో మూడు రోజుల పాటు ఉంటారు. ఈ సమయంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా చూసుకుంటే ఆ తర్వాత పాదయాత్ర సజావుగా సాగిపోతుందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కుప్పంతో పాటు పుంగనూరు, పీలేరు వంటి ప్రాంతాల్లోనూ టీడీపీ శ్రేణులతో మమేకమవుతూ చంద్రబాబు ధైర్యం నింపుతున్నారు.
దీంతో కుప్పంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ లోకేష్ యాత్రకు ఆటంకాల్లేకుండా చూసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. ఇదే క్రమంలో కుప్పంలో యాత్ర సక్సెస్ అయితే ఆ తర్వాత ఇబ్బందులు ఉండవని, అక్కడే విఫలమైతే మాత్రం అదే పరిస్ధితి ఇతర నియోజకవర్గాల్లోనూ తలెత్తుతుందనే భావన టీడీపీ వర్గాల్లోనూ కనిపిస్తోంది.