కారకులను వదిలేది లేదు: రిషితేశ్వరి ఘటనపై చంద్రబాబు
విజయవాడ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ సంస్కృతిని అరికట్టాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.
కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న తీరు, తీసుకుంటున్న చర్యల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిషితేశ్వరి తల్లిదండ్రులు చంద్రబాబును కోరారు. రిషితేశ్వరి తల్లిదండ్రులకు రూ. 10 లక్షల చెక్కును చంద్రబాబు అందజేశారు. బాధ్యులెవరిని వదిలిపెట్టేది లేదని ఆయన వారికి చెప్పారు.
రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో నిందితులకు సోమవారంనాడు కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మలేషియా పెమెండో గ్రూప్, టాటా ట్రస్ట్ డైరెక్టర్ పరేష్ సమావేశమయ్యారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో పెట్టుబడులు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరేష్ తెలిపారు.