జగన్ మావిగన్ సవాల్ కు స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!
ఏపీ రాజధానిగా అమరావతి (Amaravati) ఉండాలా లేక మావిగన్ (MAVIGUN) ఉండాలా అన్న చర్చ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విభజిత ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు (Chandrababu) తన కలల రాజధాని అమరావతిని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. జగన్ (YS Jagan) అవినీతిని కారణంగా చూపుతూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమరావతి స్ధానంలో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ అనే మరో కొత్త నగరాన్ని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై నిన్న ఓ సవాల్ కూడా విసిరారు.
తాము మావిగన్ రాజధానిని వచ్చే ఎన్నికల్లో అజెండాగా మారుస్తామని, మావిగన్ వర్సెస్ అమరావతి అజెండాతో జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏది కావాలో తేల్చుకుంటారని జగన్ తెలిపారు. తద్వారా ప్రజల్లో చంద్రబాబు ప్రతిపాదిత అమరావతి కంటే తాన ప్రతిపాదిస్తున్న మావిగన్ కు పాజిటివ్ స్పందన వస్తుందని ధీమాగా కనిపిస్తున్నారు. దీనిపై ఇవాళ సీఎం చంద్రబాబు స్పందించారు. తిరుపతిలో నిర్వహించిన జీ రామ్ జీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ సవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

గొడ్డలి పార్టీ (వైసీపీ)తో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అది రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారని, అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడారని, ఇప్పుడు ఎన్నికల్లో ఓడాక మావిగన్ అంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మన రాజధాని అమరావతే అని చంద్రబాబు తేల్చేశారు. అది దేవతల రాజధాని అని గుర్తుచేశారు. తద్వారా తమ ఛాయిస్ అమరావతి ఒక్కటే అని చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది.














Click it and Unblock the Notifications