మహిళలను బెదిరించటానికి భర్తల అరెస్ట్ .. మోసం, వేధింపులే జగన్ పాలన ... చంద్రబాబు సీరియస్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ తీరు అసలేం బాగా లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. ఏఎన్ఎం ల పట్ల, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఏఎన్ఎంలను సీఎం జగన్ పట్టించుకోలేదని, పైగా బెదిరించే వైఖరిని అనుసరించారని ఆయన మండిపడ్డారు. ఇక ఆశా వర్కర్ల జీతాలు పెంచుతూ చేసిన మొదటి సంతకమే మాయ సంతకమని ఆయన విమర్శించారు .
'స్పందన' కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి .. ఏపీ సర్కార్ మరో మందడుగు'
మహిళలను బెదిరించేందుకు వారి భర్తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా ... జగన్ పై ఫైర్ అయిన బాబు
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే . గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని.. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేశారు .తమ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని న్యాయం కోసం ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి జగన్ సర్కార్ చాలా దారుణంగా ప్రవర్తించింది అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మహిళలను బెదిరించేందుకు వారి భర్తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా అని చంద్రబాబు నిలదీశారు . న్యాయం చేయడం చేతకాక మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తారా అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రభుత్వ దుర్మార్గానికిది పరాకాష్ట అని చంద్రబాబు ట్వీట్ చేసి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు .
ఓ ఏఎన్ఎం జగన్ పై చేసిన తీవ్ర విమర్శలను పోస్ట్ చేసిన చంద్రబాబు
తమ సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం ఇటీవల ఏఎన్ఎంలు విజయవాడలో ధర్నా చేశారు. ఇక ఆ సమయంలో తీసిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో తమను బెదిరించటానికి జగన్ సర్కార్ చేస్తున్న పనిని ఓ ఏఎన్ఎం వివరించింది . సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసింది . తన భర్తతో పాటు ఎంతో మంది భర్తలను జైల్లో పెట్టారని, ధర్నాను విరమించి తాము వెనక్కి వెళితేనే వారిని వదిలేస్తామని అంటున్నారని ఏఎన్ఎంలు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎన్నికలకు ముందు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పక్కనే ఉన్న విజయవాడకు వచ్చి తమతో ఎందుకు మాట్లాడటం లేదని, తమ సమస్యలపై ఎందుకు స్పందించటం లేదని ఏఎన్ఎంలు ప్రశ్నించారు. తాము ఎంతో మందికి చెప్పి జగన్ కు ఓటేయించామని, ఇప్పుడు ఆయన వచ్చి తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ వీడియోను బాబు పోస్ట్ చేశారు.
Recommended Video
మొదటి సంతకమే మాయసంతకం .. జగన్ ఆశావర్కర్లను మోసం చేశారన్న చంద్రబాబు
ఇక ఈ వీడియో షేర్ చేసిన చంద్రబాబు అంతకు ముందు ఆశా వర్కర్ల సమస్యలను ఉద్దేశించి పోస్ట్ చేశారు. మోసానికి అలవాటుపడిన వాళ్ళు జీవితాంతం దాన్నుంచి బయటపడలేరు. సచివాలయంలోకి అడుగుపెడుతూనే ఆశావర్కర్ల వేతనం పెంచే ఫైలుపై సంతకం చేస్తే... ప్రజలు గెలిపించారు కాబట్టి మనిషిలో మార్పొచ్చిందేమో అనుకున్నాం. కానీ ఆ మొదటి సంతకమే మాయసంతకం అని తేలిపోయింది అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతే కాదు మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే, ముఖ్యమంత్రి సంతకం చేసి రెండు నెలలు కావొస్తున్నా జీఓ జారీ కాకపోవడం ఏంటి? దీనికితోడు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న ఆశా వర్కర్లను వెళ్ళిపోమంటూ వేధింపులా? మోసం చేయడానికీ, పీడించడానికీ వాళ్ళు చేసిన పాపం ఏంటి? కనీసం మొదటి సంతకంలో కూడా నిజాయితీ లేకపోతే ఎలా? అని జగన్ తొలి సంతకమే మోసమని ట్వీట్ చేశారు.