చెప్పులేసుకుని శ్రీవారి ఫోటోలు విసిరేస్తారా ? వైసీపీపై చంద్రబాబు ఫైర్..!
ఏపీ శాసనమండలిలోకి వైఎస్సార్సీపీ సభ్యులు సాక్ష్యాత్తూ శ్రీవెంకటేశ్వరస్వామి ఫొటోను తీసుకెళ్లి రాజకీయాలు చేస్తున్నారని సీఎ చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో దొరికిపోయి ఎదురుదాడి చేస్తున్నారని ఆక్షేపించారు. ఇవాళ వినుకొండలో జరిగిన స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. గత పాలకులు శ్రీవారి ప్రసాదాన్ని కూడా నాసిరకంగా తయారు చేయించారని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవ్వరికీ లేదని గుర్తుచేశారు. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్నారు.
కల్తీ నెయ్యిని పరీక్ష చేయించామని, జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ నివేదిక వచ్చిందని చంద్రబాబు తెలిపారు. దీనిపై ఏర్పాటైన సిట్ విచారణ చేసి అది అసలు నెయ్యే కాదని చెప్పిందన్నారు. వాళ్లు చేసిన తప్పును ఇతరుల పై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకు ఓ వేషం వేశాడని,చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేంతగా నాటకాలు వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని చెబితే అవినీతి జరిగిందని చెబుతుంటే తిరిగి హెరిటేజ్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని, వేంకటేశ్వరస్వామి ఫోటోను విసిరివేస్తారా.? ఎందుకు వాళ్లకింత అహంకారం? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొదరు చెత్త రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
పరామర్శలని చెప్పి వెళ్లి వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేస్తారన్నారు. బూతులు తిట్టిన వాళ్లను, రౌడీయిజం చేసిన వాళ్లను పరామర్శించే వ్యక్తులు..వాళ్ల కారు కింద పడిన వారిని మాత్రం పరామర్శించరన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి దానిని అపవిత్రం చేసిన వ్యక్తులు తిరిగి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి వచ్చిందని, దీనిని అడ్డుకుని తీరతామని సీఎం తెలిపారు.












Click it and Unblock the Notifications