చెత్త ప్రభుత్వమిది.. జగన్ ను నమ్ముకుంటే జైలుకే .. అధికారులకు చంద్రబాబు వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మచిలీపట్నం పర్యటనలో భాగంగా కొల్లు రవీంద్ర మామ ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించారు. కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నర్సింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు జగన్ సర్కార్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే నిన్న దూళిపాళ్ల నరేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడంతో పాటుగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు.
జలజగడంతో రెండు రాష్ట్రాల మధ్య అగ్గి .. కసితో పిశాచంలా చంద్రబాబు : సాయిరెడ్డి ధ్వజం
ఆత్మలతో కాదు మనుషులతో మాట్లాడే వాళ్లు కావాలన్న టీడీపీ అధినేత
ఈరోజు మచిలీపట్నంలో మాట్లాడిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కరోనాను కట్టడి చేసే వాళ్ళమని, కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. ఇదే సమయంలో మాస్కు పెట్టుకోకుంటే ప్రభుత్వం 100 రూపాయలు జరిమానా విధిస్తుంది అని గుర్తు చేసిన చంద్రబాబు, జగన్ ఎప్పుడూ మాస్కులు పెట్టుకోవడం లేదని, ఆయనకు ఎంత జరిమానా విధించాలంటూ ప్రశ్నించారు. ఆత్మలతో కాదు మనుషులతో మాట్లాడే వాళ్లు కావాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు రైతులపై వైసిపి ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారు అని విమర్శించారు.
పోలీసులను అడ్డంపెట్టుకుని కొంతవరకే పాలించగలరని వ్యాఖ్య
పండించిన పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా తమ పంటకు డబ్బులు ఇవ్వాలని అడిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు దౌర్జన్యం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు పోలీసులను అడ్డంపెట్టుకుని కొంతవరకే పాలించగలరంటూ వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెడితే భయపడి పారిపోయే పరిస్థితి లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. పోలీసులు హుందాగా ప్రవర్తిస్తూ పద్ధతి ప్రకారం పని చేయాలని పేర్కొన్నారు చంద్రబాబు.
ఆయన్ను నమ్ముకున్న వాళ్ళంతా జైలుకే
ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయనను నమ్ముకున్న వాళ్లంతా జైలుకే అంటూ, అధికారులు ఆయన మాట వింటే తర్వాత జైలుకు పోవాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది అని అధికారులను హెచ్చరించారు చంద్రబాబు. చెత్త పై కూడా పని వేసిన చెత్త ప్రభుత్వం ఇది అని మండిపడిన చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు .
ఢిల్లీ మెడలు వంచుతామని వైసీపీ వాళ్ళే మెడలు వంచుతున్నారు
వైసీపీ నేతల ఢిల్లీ మెడలు వంచుతామని చెబుతున్నారని, కాని వారే ఢిల్లీ ముందు తమ మెడలు వంచుతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గోదావరిలో ముంచుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ అరాచకాలపై రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.