సీజేఐ ఎన్వీరమణ-జగన్ పరస్పర ప్రశంసలు-విజయవాడ కోర్టు కాంప్లెక్స్ ఓపెనింగ్ లో- కీలక వ్యాఖ్యలు
విజయవాడలో కొత్తగా నిర్మించిన సిటీ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వైఎస్ జగన్ ఉమ్మడిగా ప్రారంభించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ అనంతరం సీఎం జగన్ తో కలిసి కోర్టు కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కోర్టు కాంప్లెక్స్ ను సీజేఐ రమణ, సీఎం జగన్ ఉమ్మడిగా ప్రారంభోత్సవం చేయడం, ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చోవడం కనిపించింది.

విజయవాడ కోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
విజయవాడలో నూతనంగా నిర్మించిన సిటీ సివిల్ కోర్ట్స్ ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం వైఎస్ జగన్, హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇవాళ ఉమ్మడిగా ప్రారంభించారు. విజయవాడ నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజేతో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా తరలివచ్చారు. దీంతో ఈ హై ప్రొఫైల్ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు సీజేగా త్వరలో రిటైర్ కాబోతున్న ఎన్వీ రమణ ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఎన్వీ రమణ సన్ ఆఫ్ ది సాయిల్ అన్న జగన్
సిటీ కోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ న్యాయమూర్తులకు సీఎం జగన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిటీ సివిల్ కోర్టు ప్రారంభానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ భూమిపుత్రుడైన జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని సీఎం జగన్ తెలిపారు.
జస్టిస్ రమణ చేతుల మీదుగా ఈ కోర్ట్స్ కాంప్లెక్స్ కు శంఖుస్ధాపన చేయడం, ఇప్పుడు ప్రారంభించుకోవడం కూడా చూస్తుంటే దేవుడు విధి అని అనక తప్పదని సీఎం జగన్ అన్నారు. న్యాయవ్యవస్ధకు సంబంధించి ప్రతీ విషయంలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

జగన్ పై సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం జగన్, న్యాయమూర్తులు ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా పలకరించిన జస్టిస్ ఎన్వీ రమణ .. అనంతరం ప్రసంగం మొదలుపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలుగులో మాట్లాడిన తర్వాత తాను తెలుగులో మాట్లాడకోవడం సరికాదంటూ ఎన్వీ రమణ తెలుగులోనే ప్రసంగం ప్రారంభించారు.
రాష్ట్ర విభజన తర్వాత పూర్తి కావాల్సిన ఈ కోర్ట్స్ కాంప్లెక్స్ అనేక సమస్యల కారణంగా పూర్తి కాలేదని, కానీ ప్రభుత్వాల్ని, అధికారుల్ని వెంటపడి తాను దీన్ని పూర్తి చేయించాల్సి వచ్చిందన్నారు. చివరికి భవన నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ భవనాన్ని ఉపయోగించుకుని ప్రజలకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందన్నారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీని అజెండాగా పెట్టుకుని తాను ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశానన్నారు. బెంగాల్, ఏపీ, తమిళనాడు వంటి ముఖ్యమంత్రులు కోర్టుల భవనాల నిర్మాణానికి సాయం చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.

న్యాయవ్యవస్ధపై విశ్వాసం ఉంచాలన్న సీజేఐ రమణ
న్యాయవ్యవస్ధపై విశ్వాసం కాపాడేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని జస్టిస్ సీజే రమణ కోరారు. న్యాయవ్యవస్ధపై ప్రజల్లో విశ్వాసం పోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదన్నారు. అందుకే దాన్ని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ అయ్యపురెడ్డి దగ్గర తన ప్రాక్టీస్ చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సమాజం మీవైపు చూస్తోంది.
సమాజంలో మార్పు కోసం సీనియర్ న్యాయవాదులు ప్రయత్నించాలని ఎన్వీ రమణ కోరారు. జూనియర్ న్యాయవాదుల్ని వారు తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో రిటైర్ కాబోతున్నానని, ఇక్కడి బార్ అసోసియేషన్ లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరిదీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. తన ఉన్నతికి, విజయానికీ మీరే కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు.
విభజన తర్వాత వెనుకబడ్డామన్న ఆవేదన ఇక్కడి ప్రజల్లో ఉందని, అందరూ కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అభ్యుదయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారన్న ఆశ తనకు ఉందన్నారు. కేంద్రం కూడా ఇందుకు సహకరించారన్నారు. అన్ని కులాలు, మతాలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంతోమంది న్యాయమూర్తుల్ని తాను నియమించానన్నారు. సీఎం జగన్ కూడా న్యాయవ్యవస్ధకు సహకరిస్తానని హామీ ఇచ్చారని, జగన్ సహకారం వల్లే బడ్డెట్ ఎక్కువైనా కోర్టు కాంప్లెక్స్ పూర్తయిందన్నారు. విశాఖలోనూ కోర్టు కాంప్లెక్స్ ల నిర్మాణానికి సహకరించాలని జగన్ ను కోరారు.












Click it and Unblock the Notifications