CM Chandrababu: అమరావతిలో జగన్ విధ్వసం.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు
రాజధాని అమరావతి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేత పత్రం విడుదల చేశారు. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు పైన శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం తాను రాజధానిని నిర్మించాలని చూస్తే జగన్ రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా అమరావతి దెబ్బ తింది
ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు రాజధాని అమరావతిని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా దెబ్బతిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిని అస్తవ్యస్తం చేశారని, అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందని చంద్రబాబు విమర్శించారు.

కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తాడు
అమరావతి చరిత్ర సృష్టించే నగరం అన్న చంద్రబాబు, శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎటు చూస్తున్న సమాన దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అని అందుకే రాష్ట్రానికి నడిబొడ్డున ప్రాంతమైనటువంటి అమరావతిని రాజధానిగా నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. కరడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తాడని కానీ జగన్ మాత్రమే అమరావతిని రాజధానిగా అంగీకరించలేకపోయాడని పేర్కొన్నారు.
పవిత్ర నగరం అమరావతి
బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పవిత్ర నగరం అమరావతి పేరును రామోజీరావు సూచించారని, దీనికి క్యాబినెట్ నుంచి ప్రజల వరకు అందరి ఆమోదం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన సమయంలో చాలా పవిత్రంగా ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీళ్లు, మట్టిని తెప్పించి శంకుస్థాపన చేశామన్నారు.
మోడీ కూడా రాజధాని అమరావతికి ఫౌండేషన్ వేశారు
ప్రధాని మోదీ పార్లమెంటు సాక్షిగా యమునానది నీటిని, మట్టిని తీసుకువచ్చారని, అమరావతికి ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారని రాజధానికి సహకరిస్తామని కూడా చెప్పారని తెలిపారు. కానీ అటువంటి రాజధాని అమరావతిని తాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా నిర్మించాలని భావిస్తే జగన్ నాశనం చేశాడన్నారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉన్న సమయంలో సైబరాబాద్ ను నిర్మించానని, 9 ఏళ్లలో సైబరాబాద్ సిస్టం కూడా తయారు చేశానని తెలిపారు.
అమరావతికి భూములిచ్చిన రైతులు సంతోషంగా ఉండాలనుకున్నాం
హైటెక్ సిటీని అభివృద్ధి చేయడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పరిశ్రమలు తీసుకువచ్చానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు సైబరాబాద్ ఒక చరిత్ర అన్నారు. తాను ఏ ప్రాజెక్టు చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశం అని, అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి భూమిలిచ్చిన రైతులు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించామని తెలిపారు.
జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు మొత్తం తొమ్మిది నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి పేరుతో జరిగిందని చెప్పిన చంద్రబాబు రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును జగన్ నాశనం చేశాడని నిప్పులు చెరిగారు.
బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్లీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్తాం
ఇక ఇదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వనని చంద్రబాబు స్పష్టం చేశారు అలాగే రాజధాని అమరావతిని కూడా శరవేగంతో నిర్మించే ప్లాన్ లో తాము ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. బూడిద చేసిన ప్రాంతం నుంచే మళ్లీ బంగారు భవిష్యత్తుతో ముందుకు వెళ్లాలన్నారు.












Click it and Unblock the Notifications