జగన్ సంచలన నిర్ణయం- ఆర్టీసీ ఎండీగా చంద్రబాబు హయాం డీజీపీ ఆర్పీ ఠాకూర్- నేపథ్యమిదీ..
ప్రభుత్వాలు మారగానే ప్రాధాన్యతలు మారిపోతున్న ఏపీలో మరో సంచలనం చోటు చేసుకుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డీజీపీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే అప్రాధాన్య శాఖలోకి మార్చింది. ఏడాదిన్నరకు పైగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్ పోస్టులో ఉన్న ఠాకూర్ను తాజాగా జగన్ సర్కారు కరుణించింది. ఎట్టకేలకు ఆయన్ను కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఠాకూర్కు సంక్రాంతి శుభవార్త తెచ్చినట్లయింది.

ఎట్టకేలకు ఠాకూర్కు వీడిన గ్రహణం
ఒకప్పుడు పోలీసు శాఖలో డీజీపీ, ఏసీబీ ఛీఫ్తో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగంలో కమిషనర్గా ఉన్నారు. గతంలో ఆయన వ్యవహారశైలి కారణంగా డీజీపీ పోస్టు నుంచి తప్పించిన జగన్ సర్కారు తిరిగి ఆయనకు ఆర్టీసీ ఎండీగా కీలక బాధ్యతలు కట్టబెట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు సంక్రాంతి పండుగ వేళ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు గ్రహణం వీడినట్లయింది.

ఒకప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్
1986 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ పోలీసుశాఖలో పలు కీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉంది. ఏసీబీ ఛీఫ్తో పాటు పలు కీలక విభాగాల్లో ఆయన సేవలందించారు. 2018లో అప్పటి డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయడంతో ఆయన స్ధానంలో ఠాకూర్ను అప్పటి సీఎం చంద్రబాబు డీజీపీగా నియమించారు. అప్పటికే ఏసీబీలో ఉంటూ ప్రభుత్వానికి విధేయుడిగా పేరు తెచ్చుకోవడం, ఇతరత్రా కారణాలతో ఆయనకు పోలీసుబాస్ పదవి దక్కింది. కీలకమైన ఎన్నికల ఏడాది కావడంతో ఠాకూర్ చంద్రబాబు ప్రభుత్వానికి కీలకంగా మారారు. అదే సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీకి ఇబ్బందులు తప్పలేదు.

జగన్ కోడి కత్తి కేసులో..
2019లో వైసీపీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి సమయంలో ఠాకూర్ డీజీపీగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆయన కోడి కత్తి ఘటన జరిగిన రెండు గంటల్లోనే ప్రెస్మీట్ పెట్టి ఈ ఘటనలో బాధితుడిగా ఉన్న జగన్పైనే ఆనుమానాలు రేకెత్తించే విధంగా స్పందించారు. దీంతో ఆయనపై విమర్శలు తప్పలేదు. ముఖ్యంగా జగన్పై దాడిన చేసిన శ్రీనివాస్ వైసీపీ కార్యకర్త అనే విధంగా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదం అయ్యాయి. దీంతో జగన్తో పాటు వైసీపీ నేతలంతా ఆయనపై నిప్పులు చెరిగారు. అనంతరం ఎన్నికల సందర్భంగా కూడా ఠాకూర్పై వైసీపీ కన్నెర్ర చేసింది.

జగన్ రాగానే అప్రాధాన్య పోస్టుకు
2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ వచ్చీ రాగానే డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్పై తొలి వేటు వేశారు. ఏకంగా రాష్ట్రానికి పోలీసు బాస్గా ఉన్న ఆయన్ను తప్పించి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి కమిషనర్గా పంపారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఠాకూర్ అదే పోస్టులో ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత, ఇతరత్రా కారణాలతో ప్రభుత్వం ఆయన్ను కీలకమైన ఆర్టీసీ ఎండీగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఐఏఎస్ కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఠాకూర్ రాకతో కృష్ణబాబుకు జోడు బాధ్యతల నుంచి ఆయనకు విముక్తి కలగనుంది.












Click it and Unblock the Notifications