మళ్లీ మండలికి బిల్లు పంపుతాం..ఈసారి అడ్డుకున్నా సరే చట్టం చేస్తాం: సీఎం జగన్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు హాట్హాట్గా సాగుతున్నాయి. నిన్న శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవటం ఏపీ సర్కార్ కు మింగుడు పడటం లేదు. ఇక నేడు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు సంబంధించి విద్యాచట్టం సవరణ బిల్లు విషయంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు ఆమోదం పొందకపోవటంతో నేడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
విద్యా చట్టం సవరణ బిల్లుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ విద్యా చట్టం సవరణ బిల్లుపై చర్చ జరుపుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై మొదట సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన ప్రసంగంలో మారుతున్న కాలాన్ని బట్టి ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్ల విద్యాబోధన అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మండలి పంపిన క్రమంలో మండలి విద్యా చట్టం సవరణ బిల్లుకు సవరణలు చేసి పంపించింది.
సవరణలు తిరస్కరించి మరోమారు అసెంబ్లీలో బిల్లు ఆమోదం
ఇక మండలిలో సూచించిన సవరణలు తిరస్కరించిన అసెంబ్లీ మరోమారు ఎలాంటి సవరణలు లేకుండానే శాసన సభలో విద్యాచట్టం సవరణ బిల్లు ఆమోదించారు. ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం రైట్ టు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును శాసన మండలిలో అడ్డుకున్నారని సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారని చెప్పిన జగన్ ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని చెప్పారు.
మండలిలో బిల్లు అడ్డుకున్నా సరే చట్టం చేస్తామన్న సీఎం
ఈసారి మండలి బిల్లు అడ్డుకున్నా సరే చట్టంగా మారుతుందని స్పష్టం చేశారు . అన్నీ తెలిసి కూడా కావాలనే బిల్లును అడ్డుకుంటున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాసనమండలిలో బిల్లును అడ్డుకున్నా ఎలా చట్టం చేస్తారో అన్న ఆసక్తి జగన్ వ్యాఖ్యలతో వ్యక్తం అవుతుంది. నిన్నటికి నిన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సీఆర్డీఏ రద్దు బిల్లులకు కూడా సవరణలు సూచించి సెలెక్ట్ కమిటీకి పంపి ఆమోదాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే .