ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలు; చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో చోటు చేసుకున్న వరద పరిస్థితులపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి చేస్తున్న విమర్శలకు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో సహాయక చర్యల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరదలపై జగన్ సమీక్ష .. అధికారులకు ఆదేశాలు
పాక్షికంగా దెబ్బతిన్న, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు ఇచ్చే పరిహారం, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, రెండు వేల రూపాయల అదనపు సహాయం పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, రోడ్లు తాత్కాలిక మరమ్మతులు, జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిస్థితి తదితర అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అధికారులకు వరద బాధితులను ఆదుకోవడానికి పలు సూచనలు చేశారు. అధికారులను అన్ని వివరాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్న జగన్ పలు ఆదేశాలను జారీ చేశారు.
వరదలలో జగన్ సర్కార్ వైఫల్యంపై చంద్రబాబు విమర్శలకు జగన్ కౌంటర్
ఈ క్రమంలో వరద సహాయక చర్యలలో ప్రభుత్వం విఫలమైందని, వరదలు ఇంత తీవ్రంగా గ్రామాలను ముంచెత్తడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలు అంటూ చంద్రబాబు పై జగన్ ఫైర్ అయ్యారు. గతంలో కంటే ఇప్పుడు తొందరగా వరద బాధితులకు సహాయాన్ని అందించ గలిగామని జగన్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్టపరిహారాన్ని అందించామని జగన్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా చెప్పిన జగన్
గతంలో ఇళ్ళు ధ్వంసమైన వారికి పరిహారం అందించడానికి నెల రోజులు సమయం పట్టేదని, కానీ ఇప్పుడు వారం రోజుల్లోనే వారికి పరిహారం అందిందని జగన్ చంద్రబాబుకు చురకలంటించారు. అదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే గతంలో నెల రోజులు పట్టిందని పేర్కొన్న జగన్, ఇక గల్లంతయిన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చే వారు కాదని ధ్వజమెత్తారు. కానీ వైసిపి హయాంలో వారం రోజుల్లోనే ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకున్నామని జగన్ స్పష్టం చేశారు.
వరద బాధితుల సహాయంలో వైసీపీ సర్కార్ గతం కన్నా మిన్నగా ఉందన్న జగన్
గతంలో వరదబాధితులకు రేషన్, నిత్యావసరాలు ఇస్తే చాలని అనుకునేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం రేషన్, నిత్యావసరాలను ఇవ్వడంతో పాటుగా రెండు వేల రూపాయల అదనపు సహాయం కూడా ఇస్తుందని జగన్ తెలిపారు. నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్ పూర్తయ్యే లోగానే వారికి సహాయం అందిస్తున్నామని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా గతంలో ఎన్నడూ డబ్బులు చెల్లించలేదని జగన్ పేర్కొన్నారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది అని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అని జగన్ గుర్తు చేశారు.
Recommended Video
చంద్రబాబు బురద జల్లుతున్నారని జగన్ మండిపాటు
6 వేల కోట్ల నష్టం జరిగితే ఇచ్చింది 34 కోట్ల రూపాయలేనని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న జగన్ జరిగిన నష్టం లో 40 శాతం రోడ్ల రూపేణా, 30 శాతానికి పైగా పంట రూపేణా, సుమారు 18 శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం అని స్పష్టం చేశారు. హుదూద్ లో 22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారని కానీ ఇచ్చింది మాత్రం 550 కోట్లు అని వెల్లడించారు జగన్. అదంతా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిందని కూడా స్పష్టం చేశారు. 22 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పిన పెద్దమనిషి ఇచ్చింది 550 కోట్ల రూపాయలు మాత్రమే అని జగన్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కలెక్టర్లు అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందిస్తే దానిపైన కూడా చంద్రబాబు బురద జల్లుతున్నారని జగన్ మండిపడ్డారు.