కాంగ్రెసుకు చిరు బలం: చంద్రబాబు వర్సెస్ జగన్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో రాజకీయ సమీకరణాలు పెద్ద యెత్తున మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిన ప్రాంతాన్ని సీమాంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పిలుస్తారు. తెలంగాణను మినహాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల బలాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం రాష్ట్రానికి నాయకత్వం వహించిన అన్ని పార్టీల నాయకులు కూడా సీమాంధ్ర పార్టీకి చెందినవారే కావడం విశేషం. దాంతో సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీగా సాగనుంది.
సీమాంధ్రలో బహుముఖ పోటీలు లేదా త్రిముఖ పోటీలు తప్పకపోవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే బహుముఖ పోటీలు అనివార్యంగా మారుతాయి. ఇప్పటికైతే సీమాంధ్రలో కులాల ప్రాతిపదిక మీద రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో పూర్తిగా తుడిచి పెట్టుకుని పోతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే పరిస్థితి ఆ విధంగా కనిపించడం లేదు.
కాంగ్రెసు నాయకులు ఏ మేరకు ప్రజల్లోకి చొచ్చుకునిపోతారు, ఏ మేరకు ప్రజల నుంచి వారికి ప్రతిఘఘటన ఎదురవుతుందనే విషయాలను పక్కన పెడితే సీమాంధ్రలోని ఓ బలమైన వర్గం కాంగ్రెసుకు అండగా ఉంది. కాపు సామాజికవర్గం కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే కేంద్ర మంత్రి చిరంజీవిని పిసిసి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్ాయని అంటున్నారు. చిరంజీవితో పాటు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ వంటి బలమైన నాయకులు కాంగ్రెసుకు ఉన్నారు.
భవిష్యత్తును పసిగట్టే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన సీతారామలక్ష్మమ్మను రాజ్యసభకు ఎంపిక చేశారని అంటున్నారు. చిరంజీవిపై తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజిక వర్గం నేతల నుంచి విమర్శలు ఎక్కుపెట్టించారు. కిమిడి కళా వెంకటరావు, సీతారామలక్ష్మమ్మ రాష్ట్ర విభజనపై చిరంజీవిని తప్పు పడుతూ గురువారం ప్రకటన చేశారు.
కాగా, దళిత నాయకులు కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వ్యవహరించారు. జెడి శీలం, పనబాక లక్ష్మి వంటి నాయకులు తెలంగాణను పూర్తి స్థాయిలో ప్రతిఘటించలేదు. దీంతో కాంగ్రెసు వీరిపై కూడా ఆధారపడే అవకాశాలున్నాయి. ఓ రెడ్డి సామాజికవర్గం కూడా కాంగ్రెసు వైపు నిలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి. టి. సుబ్బిరామిరెడ్డి వంటి వారు కాంగ్రెసును అంటిపెట్టుకునే ఉంటున్నారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని విడివిడిగా పరిగణనలోకి తీసుకుంటూ సీమాంధ్రలో కాపు సామాజికవర్గం అండదండలతో కాంగ్రెసు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, రాయలసీమలో కాంగ్రెసు అంతగా రాణించే అవకాశాలు లేవు. కోస్తాంధ్రలో మాత్రమే అది పనికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ బలమైన కమ్మ సామాజిక వర్గానికి, వైయస్ జగన్ పార్టీ రెడ్ల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం ఉంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో వైయస్ జగన్ ప్రాబల్యమే ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఏమైనా, సీమాంధ్రలో ఎన్నికల పోరు అత్యంత రసకందాయంలో పడుతుందనే అంచనాలు సాగుతున్నాయి.