తోక జాడిస్తే చంద్రబాబు జైలుకే, మోడీ చేతుల్లోనే..: నారాయణ
అమరావతి/విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తోక ఆడిస్తే చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే జైల్లో పెట్టిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటుకు కోట్లు కేసును గుప్పెట్లో పెట్టుకుని మోడీ చంద్రబాబును ఓ ఆట ఆడిస్తున్నారని ఆయన అన్నారు. అందువల్లే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించుకోలేకున్నారని ఆయన అన్నారు.

కేంద్రం బ్లాక్ మెయిల్ రాజకీయాలు..
కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని నారాయణ ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుది ప్రస్తుతం బానిస బతుకైందని వ్యాఖ్యానించారు.

మేం ప్రధానిని కలిశాం...
పోలవరం నిర్మాణంపై తమ పార్టీ ప్రతినిధుల బృందం నేరుగా ప్రధానిని కలిసిందని, ఆ పని టీడీపీ చేయలేకపోయిందని సిపిఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలపై సోమవారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో చర్చించి ముసాయిదాను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

బాబుది వ్యాపార ధోరణి
చంద్రబాబు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారని జనతాదళ్ (యూ) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ శరద్యాదవ్ విమర్శించారు. కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ స్మారక కమిటీ ఆదివారం విశాఖ వుడా బాలల థియేటర్లో ‘రాజ్యాంగాన్ని రక్షించండి- ప్రజాస్వామ్యాన్ని రక్షించండి 'అనే అంశంపై నిర్వహించిన స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు.

కాంక్రీట్ జంగిల్గా మార్చేశారు...
పచ్చదనాన్ని ధ్వంసం చేసి చంద్రబాబు అమరావతిని కాంక్రీట్ జంగిల్గా మార్చేశారని శరద్ యాదవ్ విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications