శాన్వీ, సత్యవతి హత్య కేసు: ఎవరీ టెక్కీ రఘునందన్, ఎందుకు చేశాడు?
వాషింగ్టన్: చిన్నారి శాన్వీని, ఆమె నాయనమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో అమెరికాలోని తెలుగు వ్యక్తి రఘునందన్ హత్య చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అతనికి మరణశిక్ష ఖరారైంది.
అమెరికాలో 2012లో ఆ జంట హత్యలు జరిగాయి. ఈ కేసులో రఘునందన్కు 2014లో అమెరికా కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న రఘునందన్కు ఫిబ్రవరి 23న మరణ శిక్ష అమలు చేయాలని స్థానిక అధికారులు నిర్ణయించారు.
అమెరికాలో శాన్వి హత్య: నన్ను చంపేయండంటూ రఘునందన్ ఆక్రోశం
గవర్నర్ సడలిస్తేనే...
పెన్సిల్వేనియాలో 2015 నుంచి మరణశిక్షపై నిషేధం అమలులో ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక్క మరణ శిక్ష కూడా అమలు కాలేదు. పెన్సిలేన్వియా గవర్నర్ మరణశిక్షపై ఉన్న నిషేధాన్ని సడలిస్తే తప్ప రఘునందన్కు శిక్షను అమలు చేయలేరు. శాన్వి తల్లిదండ్రులది గుంటూరు కాగా రఘునందన్ విశాఖపట్నంవాసి.
అతను జూదానికి బానిసై...
విశాఖపట్నానికి చెందిన రఘునందన్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగ పనిచేసేవాడు. శాన్వీ తల్లిదండ్లు వెంకట్, చెంచులత ఉండే అపార్టుమెంటులోనే అతను నివాసం ఉండేవాడు. ఆ కటుంబంతో రఘునందన్ సన్నిహితంగా ఉండేవాడు. జూదంలో పెద్ద యెత్తున డబ్బులు పోగొట్టుకున్న రఘునందన్ అప్పుల పాలయ్యాడు. అమెరికాలోని పలు కేసినోల్లో రఘు 70 వేల డాలర్లు పోగొట్టుకున్నాడు. ఆ సొమ్మంతా క్రెడిట్ కార్డుల ద్వారా, మిత్రుల నుంచి అప్పుగా తీసుకున్నదే. వాటిని తీర్చేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు.
వారిద్దరు ఉద్యోగులు కావడంతో...
శాన్వీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో వారి వద్ద పెద్దయెత్తున డబ్బులు ఉంటాయని రఘునందన్ భావించాడు. వారి నుంచి డబ్బులు లాగేందుకు 212 అక్టోబర్లో పది నెలల శాన్వీని అపహరించాడు. ఈ క్రమంలోనే ఆమె నాయనమ్మ సత్యవతిని హత్య చేశాడు.ఇంటి వద్ద ఓ లేఖను వదిలి వెళ్లాడు. తనకు 50 వేల డాలర్లు ఇవ్వకపోతే శాన్వని చంపేస్తానని బెదిరించాడు. ఆగంతకుడిలాగా ఆ పని అంతా చేశాడు.
ఏమీ తెలియనట్లు నటించాడు...
తనకు ఏమీ తెలియనట్లు తల్లిదండ్రులతో కలిసి శాన్వీని వెతుకుతున్నట్లు నటించాడు. అయితే, రఘునందన్ తాను రాసిన లేఖలో చేసిన పొరపాటుతో పట్టుబడ్డాడు. తాను వదిలి వెళ్లిన లేఖలో శాన్వీన ముద్దు పేరును రాశాడు. శాన్వీ తల్లిని లత అని, తండ్రిని శివ అని సంబోధించాడు. దీంతో చాలా దగ్గరివారే ఆ పనిచేశారనే అనుమానానికి తావు కల్పించాడు. పోలీసులకు శాన్వీ తల్లిదండ్రులు అదే విషయం చెప్పారు.
దాంతో రఘునందన్ పట్టుబడ్డాడు
పోలీసులు శాన్వీ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారినందరినీ విచారించారు. చివరకు రఘునందన్ శాన్వీని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. అతని అపార్టుమెంటులో ఓ సూట్కేసులో కుక్కి ఉన్న శాన్వీ శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రఘునందన్పై కిడ్నాప్, హత్య, చోరీ వంి 13 నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు రఘునందన్కు 2014లో మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
విశాఖ నుంచి అమెరికాకు...
విశాఖపట్నానికి చెందిన రఘునందన్ తండ్రి పోలీసు కానిస్టేబుల్గా పనిచేసేవారు. మావోయిస్టుల దాడిలో ఆయన మరణించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రఘునందన్ తల్లిని విశాఖలో వదిలిపెట్టి 2007లో అమెరికా వెళ్లాడు. శాన్విని హత్య చేయడానికి కొద్ది నెలల ముందే అతను కోమలి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. హత్య కేసులో రఘునందన్ జైలుకు వెళ్లే సమయంలో కోమలి గర్భవతిగా ఉంది.
మిత్రుడికి ఫోన్ చేశాడు...
శాన్వీని హత్య చేయడానికి ముందు రఘు తన బాల్యమిత్రుడు చందు తుమ్మలకు ఫోన్ చేశాడు. తన భార్య గర్భవతి అని, ఆమెకు సాయంగా ఉండేందుకు అత్తామామలను అమెరికా తీసుకుని రావాలని అనుకుంటున్నానని, వేయి డాలర్లు అప్పుగా ఇవ్వాలని అడిగాడు. ఆ మొత్తాన్ని చందు రఘుకు ఆన్లైన్లో బదిలీ చేశాడు. ఆ మర్నాడే రఘు శాన్వీని కిడ్నాప్ చేశాడు.
సంఘటన ఎప్పుడు ఏం జరిగింది.
రఘు 20112 అక్టోబర్ 22వ తేదన పెన్సిల్వేనియాలోని అప్పర్ మెరియన్ టౌన్షిప్లోని అపార్టుమెంటు నుంచి శాన్వీని కిడ్నాప్ చేశాడు. ఆ ప్రయత్నంలో అడ్డు వచ్చిన శాన్వీ నాయనమ్మ సత్యవతిని హత్య చేశాడు. రఘునందనే శాన్వని కిడ్నాప్ చేసినట్లు 2012 అక్టోబర్ 28వ తేదీన పోలీసు విచారణలో తేలింది. రఘు అపార్టుమెంటులోని ఓ సూట్కేసులో ఉన్న శాన్వీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాంట్గోమరి కౌంటీ కోర్టు రఘునందన్కుక మరణశిక్ష విధిస్తూ 2014 నవంబర్ 20వ తేదీన తీర్పు చెప్పింది. రఘునందన్కు మరణశిక్ష తేదీని పెన్సిల్వేనియా జైలు అధికారులు 2018 జనవరి 11వ తేదీన ఖరారు చేశారు.