అందుకే ఒక్కరోజు బడ్జెట్- దేశమంతా ఏపీవైపు చూడటమంటే ఇదేనా ? దేవినేని ట్వీట్
ఏపీలో కోవిడ్ సమయంలో ఒక్కరోజు బడ్డెట్ సమావేశం నిర్వహించాలన్న వైసీపీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. మార్చిలో కరోనా తక్కువగా ఉన్న సమయంలో బడ్డెట్ సమావేశాలు నిర్వహించకుండా.. ఇప్పుడు కోవిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో ఒక్కరోజు సమావేశం పెట్టాలన్న నిర్ణయంపై విపక్ష టీడీపీ మండిపడుతోంది. ఈ ఒక్క రోజు భేటీని బహిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
రేపు అసెంబ్లీ ఒక్కరోజు భేటీ నిర్వహించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక కోసం మార్చిలో బడ్డెట్ వాయిదా వేశారు, రెండేళ్లు డిమాండ్లపై చర్చ లేకుండా లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. మొక్కుబడి తంతుంగా ఒక్కరోజు బడ్డెట్. దేశం మొత్తం ఏపీ వైపు చూడటం అంటే ఇదేనా అంటూ దేవినేని ఉమ తన ట్వీట్లో వైసీపీ సర్కారును సూటిగా ప్రశ్నించారు.
కరోనా సమయంలో బడ్టెట్ సమావేశం నిర్వహణపైనా దేవినేని ఉమ వైసీపీ సర్కారుకు చురకలు అంటించారు. కరోనా కష్ట సమయాల్లో బడ్డెట్ సమావేశాలు ఎందుకు పెట్టాల్సిన పరిస్దితి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ తన ట్వీట్లో ఉమ ప్రశ్నించారు. ఇదే ట్వీట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బడ్డెట్పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిర్వహించిన ప్రెస్మీట్ వీడియోను కూడా లింక్ చేశారు. ఈ ప్రెస్మీట్లో అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఒక్కరోజు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.