సుజనాతో డిజిపి భేటీ: కెటిఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన పల్లె
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరితో ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు సమావేశమయ్యారు. డిజిపిల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సుజనా చౌదరిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ కూడా వచ్చారు.
డిజిపిల సమావేశం ముగిసిన తర్వాత శుక్రవారం సాయంత్రం జెవి రాముడు సుజనా చౌదరితో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో సుజనా చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఎపి కేంద్రానికి ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఉన్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణ మంత్రి కెటి రామారావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి కెటిఆర్కు లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెటిఆర్ సంస్కారం నేర్చుకోవాలని, మాట్లాడేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
మీ నాన్నకు రాజకీయ భిక్ష పెట్టింది టిడిపియేనని అంటూ మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవద్దని సలహా ఇచ్చారు. సెక్షన్ 8ను అమలు చేయాలని గవర్నర్ను, కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు ఆంధ్ర పోలీసులను భద్రతకు నియోగించుకుంటే తప్పేమిటని, ఎపి ముఖ్యమంత్రికి తెలంగాణ పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని ఆయన అడిగారు. చంద్రబాబుపై కెటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు.
వారి మధ్య చీకటి ఒప్పందం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఏపీ మంత్రి అచ్చెనాయుడు ఆరోపించారు. అసత్య ప్రసారాలతో టీడీపీని దెబ్బతీసేందుకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆయన శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో అన్నారు.