టీడీపీలో చేరిన డొక్కా.. వైసీపీలో చేరబోతున్న యనమల..!
ఏపీలో ఎన్నికల వేళ నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పూర్తయినా నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న అమరావతి రాజధాని ప్రాంత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీని వీడి ఇవాళ టీడీపీలో చేరిపోయారు. మరోవైపు కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఇవాళ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆయన వైసీపీలో చేరే అవకాశముంది.
గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్.. గత ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీని వీడి ఎమ్మెల్సీ పదవికీ గుడ్ బై చెప్పారు. తిరిగి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే వైసీపీలో ఈసారి టికెట్ ఆశించినా దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యం కూడా తగ్గడంతో చేసేది లేక ఎన్నికల వేళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

మరోవైపు కాకినాడ జిల్లా తునికి చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన యనమల కృష్ణుడు కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వరుసగా రెండుసార్లు తుని నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన కృష్ణుడికి ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఆయన.. ఇవాళ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆయన వైసీపీలో చేరే అవకాశముంది.












Click it and Unblock the Notifications