ఏపీ పాలిటిక్స్ లో ఎక్స్ ట్రా ప్లేయర్లు? గతంలో టీడీపీకి- ఇప్పుడు వైసీపీకి మద్దతుగా..?
ఏపీ రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తోడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. వీరి తర్వాత స్ధానంలో తాజాగా మరికొన్ని పార్టీలు, నేతలు ఎంట్రీ లేదా రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో వీరి ప్రభావం ఎంత మేరకు ఉంటుందో తెలియదు కానీ ఈ ఎక్స్ ట్రా ప్లేయర్ల రాకతో, వారు చేస్తున్న వ్యాఖ్యలతో అధికార వైసీపీకి ప్రయోజనం ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీకి కూడా ఇలాంటి ఎక్స్ ట్రా ప్లేయర్లు పలుమార్లు సహకరించడమే ఇందుకు కారణం.
ఎక్స్ ట్రా ప్లేయర్లు
ఏపీ రాజకీయాల్లో, ఆ మాట కొస్తే విభజనకు ముందు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ ఎక్స్ ట్రా ప్లేయర్లు ఉంటూనే ఉన్నారు. అసలు రాజకీయం చేస్తున్న పార్టీలకు తోడు మధ్యలో వీరి ఎంట్రీ, రాజకీయాలు ఒక్కోసారి క్లిక్ అవుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. దీంతో రెగ్యులర్ రాజకీయ పార్టీల కంటే వీరు చేసే హంగామాకూ, వ్యాఖ్యలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. చివరికి అసలు రాజకీయ పార్టీల్లో ఎవరో ఒకరిని ముంచడమే లక్ష్యంగా వీరి రాజకీయం పనికొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయాల్లో ఈ ఎక్స్ ట్రా ప్లేయర్ల ఎంట్రీ చర్చనీయాంశమవుతోంది.
టీడీపీ హయాంలో ఎక్స్ ట్రా ప్లేయర్స్
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఉద్యోగ సంఘాల రూపంలో కొందరు, సామాజిక, సమైక్యాంధ్ర ఉద్యమాల రూపంలో మరికొందరు ఎంట్రీ ఇచ్చేశారు. వీరు తమ చర్యలతో అప్పట్లో అధికారానికి పదేళ్ల పాటు దూరమైన టీడీపీకి భారీగానే లబ్ది చేకూర్చారు. ముఖ్యంగా అనుభవంపై వారు అప్పట్లో లేవనెత్తిన చర్చలు, చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత జనంలోకి బాగానే వెళ్లాయి. ఫలితంగా 2014 ఎన్నికల నాటికి రాష్ట్రానికి అనుభవజ్ఢుడైన నేత సీఎం అయితే విభజన గాయాలు త్వరగా మానే అవకాశం ఉంటుందని జనం భావించే పరిస్ధితి వచ్చింది. దీంతో చంద్రబాబుకు జనం పట్టం కట్టేశారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.
2019 ఎన్నికల సమయంలోనూ
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ ఎక్స్ ట్రా ప్లేయర్లు మరోసారి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా గరుడ పురాణం శివాజీతో పాటు మరికొందరు ఇలాగే టీడీపీ ప్రభుత్వానికి మరోసారి అధికారమిస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని చెప్పే ప్రయత్నం చేసారు. అలాగే అప్పట్లో అమరావతికి వ్యతిరేకంగా విపక్షంలో ఉన్న వైసీపీ చేసిన ఆరోపణల్ని తప్పుబడుతూ క్షేత్రస్ధాయిలో రంగంలోకి దిగి అమరావతిలో కట్టడాలను జనానికి చూపించేందుకు ప్రయత్నించారు. తద్వారా అమరావతి గ్రాఫిక్స్ కాదని చెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే జనం మాత్రం వేరేలా తలచారు. ఫలితంగా వైసీపీ భారీ మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చింది.
ఈసారి వైసీపీకి మద్దతుగా ఎంట్రీ?
గతంలో టీడీపీకి మద్దతుగా ఉన్నవారు, లేదా ఇతర పార్టీల తరఫున పోటీ చేసిన వారు లేదా స్వతంత్రంగా ఉన్న వారు సైతం ఈసారి ఎంట్రీ ఇచ్చేశారు. మరికొందరు రీఎంట్రీలు కూడా ఇచ్చేశారు. ఇలాంటి వారిలో బీఆర్ఎస్, కేఏపాల్, జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారి గురించి చర్చ జరుగుతోంది.
ఈసారి వీరు చేస్తున్న వ్యాఖ్యలు, పోటీపై ఇస్తున్న లీకులు చూస్తుంటే ఈసారి కచ్చితంగా వీరు ఏపీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ద్వారా ఉనికి చాటుకోవడంతో పాటు అధికార వైసీపీకి మద్దతుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా విపక్షాల్లో ఓట్ల చీలిక మరింత ఎక్కువ కావడంతో పాటు అధికార వైసీపీకి మరోసారి భారీగా లబ్ది చేకూరే అవకాశాలు ఉండేలా ఉన్నాయి. విపక్షాల్లో కలిసి పోయి వీరు చేసే హంగామాతో ఓట్ల చీలిక భారీగా ఉంటే అది కచ్చితంగా వైసీపీకి ప్రయోజనం చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది.