ఎట్టకేలకు పోసాని కృష్ణమురళికి విముక్తి- గుంటూరు జైలు నుంచి ..!
వైసీపీ నేత, టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. గత నెలలో తొలిసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల కేసులో అరెస్టు తర్వాత ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. అలాగే సీఐడీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో కేసు నమోదు చేసింది. ఇతర కేసుల్లో ముందుగా బెయిల్ లబించినా సీఐడీ కేసులో మాత్రం పోసానికి జైలులోనే ఉండిపోక తప్పలేదు.
ఈ నేపథ్యంలో నిన్న గుంటూరులోని సీఐడీ కోర్టు.. పోసాని కృష్ణమురళికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ షరతుల్లో ఒకటైన పూచీకత్తు సమర్పణ ఆలస్యం కావడంతో నిన్న ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. ఇవాళ మాత్రం బెయిల్ షరతులు పూర్తి చేసి ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం హైదరాబాద్ లోని ఇంటికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుకు సహకరించాలనే షరతుపై పోసాని కృష్ణమురళికి పలు కోర్టులు బెయిల్ ఇచ్చాయి. అలాగే మరికొన్ని కేసుల్లో నోటీసు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఏ క్షణమైనా తిరిగి ఆయన్ను విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.
గతంలోనూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ లభించిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే లోపే సీఐడీ పోలీసులు తమ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చివరికి 26 రోజుల జైలు జీవితం తర్వాత పోసాని ఇవాళ విడుదలయ్యారు. దీంతో ఆయనకు పూర్తి ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications