చరిత్రలో తొలిసారి: ఏపీ కేబినెట్ భేటీకి స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హాజరుకానున్నారు.
అమరావతి: బుధవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హాజరుకానున్నారు. కాగా, కేబినెట్ భేటీకి స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి హాజరుకావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరిలో జరిగే మహిళా పార్లమెంటు సదస్సుకు సీఎం, మంత్రులను ఆహ్వానించేందుకు స్పీకర్ కోడెల కేబినెట్ సమావేశానికి బయల్దేరారు. కేబినెట్ ఎజెండా ప్రారంభానికి ముందే మంత్రివర్గంతో ఆయన భేటీ కానున్నారు. పార్లమెంటు సదస్సుకు మరింత పాధాన్యం తీసుకొచ్చేందుకే ఆయన సీఎంతోపాటు మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ సెక్రటేరియట్లోనే అడుగుపెట్టే అవకాశమే అరుదు. అలాంటిది కేబినెట్ సమావేశానికి స్పీకర్ కోడెల హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బుధవారం ఉదయం 11.30గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో సంక్షేమ పథకాలు, జన్మభూమి ఫిర్యాదులు, పలు సంస్థలకు భూకేటాయింపులు, జనవరి 26న తలపెట్టిన ఆర్కే బీచ్ ఆందోళనపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications