AP Polls: జూన్ 4న ఏం జరగబోతోందో చెప్పేసిన గంటా- జగన్ కామెంట్స్ కు కౌంటర్.. !
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులే మిగిలున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాక ప్రచారంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చకు స్పందించిన టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4 లో విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు గంటా దీటుగా బదులిచ్చారు.
తాజాగా గాజువాకకు ప్రచారానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్ జూన్ 4న తాము గెలిచి ప్రమాణస్వీకారం చేయబోతున్నానని, ఈసారి విశాఖ నుంచే పాలన ఉంటుందని ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో మరోసారి విజయంపై జగన్ ధీమా స్పష్టమైంది. అయితే జగన్ వ్యాఖ్యలపై అప్పటి నుంచి టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ గంటా శ్రీనివాస్ స్పందిస్తూ.. జూన్ 4 న జగన్ రాజీనామా చేయబోతున్నారన్నారు.

ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా కూటమి పనిచేస్తోందని గంటా శ్రీనివాస్ తెలిపారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గంటా వెల్లడించారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కూటమిగా ఏర్పడినట్లు గంటా వివరించారు. ఇవాళ ఆయన భీమిలి మ్యానిఫెస్టోను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మ్యానిఫెస్టోపై మాట్లాడుతూ.. ఇందులో దేనికీ పొంతన లేదని, పాత మేనిఫెస్టోనే రిపీట్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications