జగన్ సభ ఉంది.. పంటలు వేయొద్దు- గుడివాడ రైతులకు కొడాలి ఆర్డర్ వివాదం
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించి, అనంతరం కేబినెట్ మార్పుల తర్వాత పార్టీకి పరిమితమవుతున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో వివాదంలో చిక్కుకున్నారు. డిసెంబర్ 21న తన నియోజకవర్గంలో సీఎం జగన్ బహిరంగసభ నేపథ్యంల కొడాలి నాని స్ధానిక రైతులకు ఇచ్చిన ఆదేశాలు వివాదం రేపుతున్నాయి.
డిసెంబర్ 21న సీఎం జగన్ గుడివాడలోని మల్లాయిపాలెం లే అవుట్ లో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కొడాలి నాని.. తాజాగా ఈ సభా ప్రాంగణానికి చుట్టుపక్కల పంటలు వేసుకుంటున్న రైతులకు ఓ ఆదేశం ఇచ్చారు. ఇక్కడ సీఎం జగన్ సభ ఉంది కాబట్టి ఎవరూ పంటలు వేయొద్దని రైతుల్ని కోరారు. దీంతో అప్పటికే మినుములు వేసేందుకు సిద్ధమైన రైతులు కొడాలి ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మల్లాయిపాలెం లే అవుట్ పక్కన ఉన్న 14 ఎకరాల్లో రైతులు మినుములు వేయాలని భావించారు. కానీ స్ధానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఆదేశాల నేపథ్యంలో వారు పంట వేయలేని పరిస్దితి ఉంది. దీంతో వారు ప్రభుత్వం నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే నానిని కోరుతున్నారు. కానీ ఆయన వీరికి నష్ట పరిహారం ఇప్పించే పరిస్ధితి కూడా లేదు. దీంతో సీఎం సభ పేరుతో తమ పంటలు వేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా పరిహారం కూడా ఇప్పించకపోవడంతో వారు విపక్షటీడీపీ నేతల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో స్ధానిక టీడీపీ ఇన్ చార్జ్ రావి వెంకటేశ్వరరావు ఈ వ్యవహారంపై విమర్శలకు దిగారు.