చంద్రబాబు లేఖపై నిప్పులు చెరిగిన కన్నబాబు-రాజ్యాంగ పరిరక్షణ వ్యాఖ్యలపై ఫైర్-అదేనా నీతి ?
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు. బాబు అధికారంలో ఉంటే స్వజన ప్రయోజనాలు.. లేనప్పుడు రాజ్యాంగ పరిరక్షణా.. అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను ఎవరు నిర్వీర్యం చేశారో చర్చిద్దామా బాబూ అని అడిగారు. ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అని నిలదీశారు. మీడియా స్వేచ్ఛ అంటే ఎల్లో మీడియా స్వేచ్ఛా బాబూ అని కన్నబాబు సూటి ప్రశ్న వేశారు.
చంద్రబాబు వంటి కొంత మంది స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని కూడా వాడుకుంటున్నారని వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రతి దాన్ని రాజకీయంగా చూసే వారిలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబునాయుడని, ఆయనో గొప్ప రాజ్యాంగ ప్రేమికుడిలా ఓ ప్రేమ లేఖను ప్రజలకు రాశారని, ఆ లేఖ నిండా జగన్ గారిపై శాపనార్ధాలున్నాయన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ఉన్నాయన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత అచ్చు గుద్దినట్లు చంద్రబాబుకు సరిపోతుందన్నారు. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడిన ఈ పెద్ద మనిషికి అధికారంలో లేనప్పుడు రాజ్యాంగం గుర్తుకువస్తుందని, అధికారంలో లేనప్పుడు ప్రజల హక్కులు, బాధ్యతలు గుర్తుకు వస్తాయని కన్నబాబు ఆక్షేపించారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం స్వజన ప్రయోజనాలు మాత్రమే గుర్తుకు ఉంటాయని, తనవారి ప్రయోజనాలకు భంగం కలగకుండా ఏదైనా చేస్తాడన్నారు.

ఈ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేసింది ఎవరనే అంశంపై చర్చకు వస్తావా చంద్రబాబు..? అని కన్నబాబు ప్రశ్నించారు. మహానేత రాజశేఖరరెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేస్తే...ఆయన అడుగు జాడల్లో ఆ స్ఫూర్తిని అందుకుని జగన్మోహన్ రెడ్డి గత మూడున్నరేళ్ళుగా అంబేద్కర్ ఆశయ సాధన దిశగా పరిపాలన చేస్తున్నారని కన్నబాబు గుర్తుచేశారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి గొప్పగా మాట్లాడుతున్న చంద్రబాబు హయంలో ఏం చేశారో మేం చేప్తాం.. మీరు చర్చకు వస్తారా..?. అని అడిగారు. అబద్దాలను అలవోకగా, దుర్మార్గంగా సొంత బాకాలతో ప్రచారం చేసి, లేనిది ఉన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడన్నారు. ఆ లేఖలో చంద్రబాబు పడ్డ తపన ప్రజల కోసం మాత్రం కాదన్నారు.
ఎన్టీఆర్ ను కూలదోసి క్యాంపు రాజకీయాలు నడపడం రాజ్యాంగ పరిరక్షణ అవుతుందా..? ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యాంగ స్ఫూర్తి అనేది చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి.. ఓత్ ఆఫ్ సీక్రెసీకి తిలోదకాలు ఇచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, 4,500 ఎకరాలను ఏవిధంగా సంపాదించుకున్నారో సీఐడీ స్పష్టంగా చెప్పిందని కన్నబాబు విమర్శించారు. మంత్రి వర్గ ఉపసంఘం కూడా అదే తేల్చిందన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలు ఈ దేశానికి ఆయన ఇచ్చిన సందేశమా..? అనేది జవాబు చెప్పాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతిసేలా బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అనేక సార్లు చంద్రబాబు అడ్డగోలు వాఖ్యలు చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని రైతులు రోడ్డెక్కితే.. కాల్పులు జరిపి రైతులను చంపేశాడని కన్నబాబు విమర్శించారు. బషీర్బాగ్లో గుర్రాలతో మహిళలను తొక్కించిన వ్యక్తి చంద్రబాబే. జీతాలు పెంచమని అంగన్వాడీ నుంచి ఎన్జీవోల వరకు ఆందోళనలు చేస్తే లాఠీలతో కొట్టించారన్నారు. నోరెత్తిన ప్రతి ఒక్కరిపై అన్యాయంగా కేసులు పెట్టి, దుర్మార్గంగా, కిరాతకంగా కొంతమందిని చంపి తన కుర్చీని కాపాడుకున్నాడని, ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని మాట్లాడటం హాస్యాస్పదమని కన్నాబాబు విమర్శించారు.
ఇంగ్లీష్ బాష నేర్చుకుంటే పులి పాలు తాగినట్లు అని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారని, అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెడితే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువచ్చింది మీరు కాదా...?. అని కన్నబాబు ప్రశ్నించారు.అమరావతిలో కొంత మంది పేదలకు భూములు ఇస్తామంటే.. వారికి నిలువ నీడ ఉండకూడదని, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టులకు వెళ్లింది మర్చిపోయారా.?. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అన్నట్లు రాజ్యాంగ స్ఫూర్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఉత్తరాలు రాస్తున్నాడన్నారు. వీడేం(బాబు) ఖర్మ ఈ రాష్ట్రానికి అనుకోబట్టే ప్రజలు 2019లో సరైన తీర్పు ఇచ్చారని కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ను మంగళగిరిలో ఓడించారని, ఆ విషయాన్ని చంద్రబాబు మర్చిపోయాడన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్ గారు నిలిచిపోతున్నాడని, దాంతో ఇదేం ఖర్మ తెలుగుదేశానికి అని చంద్రబాబు భావిస్తున్నాడన్నారు.












Click it and Unblock the Notifications