లారీలో పైన మొక్కజొన్నలు..లోడులో క్రింద ఏముందో చూసి షాక్ అయిన పోలీసులు!!
ఏపీలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఎంత పెద్ద ఎత్తున గంజాయి కట్టడికి రంగంలోకి దిగినా గంజాయి అక్రమ రవాణా ఆగటం లేదు .కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు అక్రమ మార్గాల ద్వారా గంజాయి దందా సాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్న వారు తాజాగా మొక్కజొన్నల లోడులో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణాకు పూనుకున్నారు. ఇక వీరిని పోలీసులు పట్టుకున్నారు.
కృష్ణవరం చెక్ పోస్ట్ వద్ద మొక్కజొన్నల లోడులో గంజాయి రవాణా
ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. ఇతర ప్రాంతాలకు గంజాయిని తరలించడం కోసం గంజాయి స్మగ్లర్లు డిఫరెంట్ రూట్లను ఫాలో అవుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా చెక్ పోస్ట్ దగ్గర నిర్వహించును వాహన తనిఖీలు భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. విశాఖ వైపునుంచి ఒక కారు, ఒక లారీ కృష్ణవరం టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్దకు రాగా, మొదట మొక్కజొన్నల లోడుతో కనిపించిన లారీలో అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు.
మొక్కజొన్నల మధ్య 1,419 కేజీల గంజాయి, 1.30 కోట్ల విలువ
లారీలో మొక్కజొన్నల మధ్య 66 మూటలలో 1,419 కేజీల గంజాయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు అక్కడి నుండి తప్పించుకున్నారు. పోలీసులు సీజ్ చేసిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 1.30 కోట్ల రూపాయలు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే 4 రోజుల క్రితం విజయనగరం జిల్లా శృంగవరపుకోట లో రెండు వేల కిలోల గంజాయిని ఓ ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తూ దొరికిపోయారు స్మగ్లర్లు. పుష్ప సినీ ఫక్కీలో గంజాయి తరలించే ప్రయత్నం చేశారు.
ఇటీవల విజయనగరం జిల్లాలోనూ వరుసగా గంజాయి కేసులు
ఆ తర్వాత మళ్ళీ విజయనగరం జిల్లా ఎస్ కోట లో 43 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో గంజాయి మాఫియా మళ్లీ పెట్రేగిపోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం కొత్త మార్గాల్లో ఎవరికీ అర్థం కాకుండా గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న స్మగ్లర్ల భరతం పట్టడానికి పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి నిత్యం తనిఖీలను చేపడుతున్నారు. అయినప్పటికీ ఎవరికీ దొరక్కుండా గంజాయి స్మగ్లర్లు గంజాయి దందాను చేస్తూనే ఉన్నారు.
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలోనూ పట్టుబడుతున్న గంజాయి స్మగ్లర్లు
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ గంజాయి దందా విచ్చలవిడిగా జరుగుతుంది. తాజాగా నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న రెండు ముఠాలను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో తొమ్మిది మందిని అరెస్టు చేయగా వారి నుంచి 52.9 లక్షల విలువ చేసే 481 కిలోల గంజాయి, 11 మొబైల్ ఫోన్స్, నాలుగు లక్షల నగదు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
నిత్యం తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారు పట్టుబడడం సంభవిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దీనిపై ఉక్కు పాదం మోపడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు సైతం రంగంలోకి దిగి గంజాయికి అడ్డుకట్ట వేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.