విజయవాడలో త్వరలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ .. కరోనా కొత్త వేరియంట్లతో జగన్ సర్కార్ నిర్ణయం
భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశముందని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు అధికారిక డేటా వెల్లడిస్తుంది. వీరిలో ఒక వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇక ఈ వైరస్ ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఏపీకి ఒమిక్రాన్ భయం: విదేశాల నుండి 10రోజుల్లోనే వేలాది మంది; వారిని గుర్తించటంలో కొత్త పరేషాన్
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటుపై ఏపీ దృష్టి
భారత దేశంలోని ప్రధాన నగరాలలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సరిహద్దు రాష్ట్రాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తే ఫలితాలు వచ్చే వరకు ఆలస్యం అవుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆరోగ్య వసతుల కల్పన అన్ని రాష్ట్రాలకు అనివార్యంగా మారింది.
విజయవాడ కేంద్రంగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్
కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ అయిన SARS CoV-2 యొక్క సర్క్యులేటింగ్ స్ట్రెయిన్లను గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఇటీవల గుంటూరులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మొట్టమొదటి పూర్తి-జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఇక విజయవాడ కేంద్రంగా మరో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చెయ్యాలని భావిస్తుంది. కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ సీక్వెన్స్ ద్వారా వైరస్ స్వభావం మరియు మూలాన్ని అర్థం చేసుకోవడానికి మరియు ఉత్పరివర్తనాలను గుర్తించడానికి ఇతర ఉద్భవిస్తున్న లేదా తిరిగి ఉద్భవిస్తున్న వ్యాధికారకాలను క్రమం చేయడంలో కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కీలకంగా పని చేస్తుంది. ఇది సంక్రమణకు కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది.
జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ కు నమూనాలు పంపుతున్న రాష్ట్రం
జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లేకపోవడం వల్ల, ఇంతకు ముందు ఏపీకి సంబంధించిన పాజిటివ్ కోవిడ్-19 నమూనాలను హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)కి మరియు ఇతర ప్రయోగశాలలకు పంపేవారు. కానీ ఏపీలోనే ల్యాబ్ లను ఏర్పాటు చెయ్యాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించటంతో ఏపీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటు శరవేగంగా సాగుతుంది. ఏపీ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటుకు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ తో ఒప్పందం కుదుర్చుకుంది.
వచ్చే వారంలో విజయవాడలో ల్యాబ్ కార్యాకలాపాలు ప్రారంభం
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో 15 శాతం నమూనాలు వైరస్ జన్యు క్రమాన్ని గుర్తించటం కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపిస్తున్న నేపథ్యంలో, ఫలితాల వెల్లడిలో జాప్యం అవుతోంది. ఈ క్రమంలోనే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాబ్ లు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విజయవాడలో వచ్చే వారంలో ల్యాబ్ ల కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఈ ల్యాబ్ లో పనిచేసే వైద్య సిబ్బందికి హైదరాబాద్ లో శిక్షణ ఇప్పించామని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రోజుకో రూపంలో పంజా విసురుతున్న కారణంగా వైద్య సదుపాయాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటుకు రంగంలోకి దిగింది.