టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి: జగన్పై సంచలనం, బాబు తల నరుకుతానని ఎందుకన్నానంటే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు ఇతర నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. గిడ్డికి, ఇతర నాయకులకు సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు ఇతర నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. గిడ్డికి, ఇతర నాయకులకు సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చదవండి: నేను వెళ్లను, గిడ్డి ఈశ్వరికి ఆదిలోనే గట్టి షాక్: చర్చలు ఫలించాయా?
చదవండి: చంద్రబాబును కలిసిన గిడ్డి ఈశ్వరి, ఇతర వైసీపీ నాయకులు
జగన్పై గిడ్డి తీవ్ర వ్యాఖ్యలు, అందుకే చేరా
ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పాడేరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పారు. చంద్రబాబు పాలనలో గిరిజనుల బతుకులు బాగుపడతాయని భావిస్తున్నానని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తాను ఎప్పుడు కూడా గిరిజన పక్షపాతిని అన్నారు.
వైసిపిలో నా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది, జగన్ గుర్తించలేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన పనిని ప్రతిపక్ష నేత జగన్ గుర్తించకపోవడం వల్లే తాను టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. సీఎం సహకారంతో గిరిజనుల బతుకులు బాగుపడతాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం తాను పడిన కష్టాన్ని జగన్ గుర్తించలేదన్నారు.
వారినందరినీ ఆహ్వానిస్తాం
చాలామంది టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. అభివృద్ధిని కోరుకొని పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. విశాఖలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఏజెన్సీలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అరకు తన మానస పుత్రిక అన్నారు.
మా పనితీరు చూసి టీడీపీలో చేరుతున్నారు
రాష్ట్రం కష్టాల్లో ఉందని, అభివృద్ధికి సహకరించాలని తాను కోరుతున్నానని చంద్రబాబు చెప్పారు. తాము అభివృద్ధిని చూపించి సహకారం అడుగుతున్నామని, తమ పని తీరు చూసి టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు.
బాబు తల నరుకుతాననే వ్యాఖ్యలపై వివరణ
సీఎం చంద్రబాబుపై గతంలో చేసిన తల నరుకుతానన్న వ్యాఖ్యలపై గిడ్డి ఈశ్వరి వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబుపై ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. గిరిజనుల జోలికి వస్తే ఊరుకోమనే ఉద్దేశ్యంతో ఆనాడు అలా మాట్లాడానని చెప్పారు. గిరిజనుల జోలికి వస్తే ఏ రోజుకైనా అలాగే జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైడ్ తవ్వకాలు నిలిపివేయాలనే డిమాండును చంద్రబాబు ముందు ఉంచారు.