పోలవరం వరద నీరు మళ్లింపు మొదలు- 6.5 కిలోమీటర్ల మేర-ఇంజనీరింగ్ అద్భుతం
పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఈ ఏడాది చివరి కల్లా ఎట్టి పరిస్దితుల్లోనూ పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఈ వర్షాకాలంలో పనులకు అంతరాయం లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గోదావరికి వచ్చే వరద నీటిని మళ్లించేందుకు ఈసారి పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసింది. గతంలో వరద నీటి కారణంగా పనులకు ఆటంకం కలగడంతో ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
పోలవరం అప్డేట్
పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ చకచగా పనులు పూర్తిచేస్తోంది.
కేంద్రం నుంచి పూర్తిస్ధాయిలో నిధుల రాక లేకపోయినా అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇచ్చేలా మేఘా ఇంజనీరింగ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందుకే ఈ వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా పనులు ఆగకుండా మందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.
గోదావరి వరద నీటి మళ్లింపు మొదలు
పోలవరం స్పిల్వే నుంచి ఈ వర్షాకాలంలో వరద నీరు మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుంచి కుడివైపుకు అధికారులు మళ్లిస్తున్నారు. దీని ద్వారా అప్రోచ్ ఛానల్ నుంచి స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ వరకూ వెళ్లి అక్కడి నుంచి మరలా పైలట్ ఛైనల్ నుంచి సహజ ప్రవాహంలో గోదావరి నది కలవబోతోంది. ఈ లెక్కన చూస్తే ఆరున్నర కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని దారి మళ్లించబోతున్నారు. దీంతో ఈ సీజన్లో ప్రాజెక్టు వద్ద పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు.
Recommended Video
ఈ సీజన్ నుంచే పోలవరం నీటి విడుదల
ఈ సీజన్ నుంచే గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్ధంగా ఉఁచారు. త్వరలో మిగతా గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు పంపుతారు. మరోవైపు ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.