తిరుపతితో సహా మూడు ఐకానిక్ రైల్వేస్టేషన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపైన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూలపేట, విశాఖపట్నం, రామాయపట్నం వంటి పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని కల్పించాలని, కనెక్టివిటీని పెంచేందుకు లైన్లు వేయాలని రైల్వే అధికారులకు చంద్రబాబు సూచించారు.
ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఆయన ఏపీని లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఉత్పత్తులను రవాణా చేయడానికి రైల్వే సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్న ఆయన దానికి కావలసిన రైల్వే సదుపాయాలను కల్పించాలని సూచించారు.

ఏపీ రైల్వే ప్రాజెక్ట్ లపై సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న గుంటూరు గుంతకల్, నడికుడి శ్రీకాళహస్తి, గుణదల ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట, తుముకూరు రాయదుర్గం మధ్య జరుగుతున్న రైల్వేలైను ప్రాజెక్టుల పురోగతిపై చర్చించిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రాజధాని అమరావతి రైల్వే కనెక్టివిటీ విషయంలో హైదరాబాద్ బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై మార్గాలలో హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనలను సమీక్షించారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు
అమరావతిలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం చేసేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక చెన్నై బెంగళూరు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ తిరుపతిని కలుపుతూ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు. విజయవాడ మధ్య జరిగే మూడో లైన్ పనులు, ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకు డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్ పైన సీఎం దిశా నిర్దేశం చేశారు.
1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనుల పైన చంద్రబాబు సూచన
కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనుల పైన కూడా చర్చించిన సీఎం చంద్రబాబు ఏపీని లాజిస్టిక్ కారిడార్ గా మార్చాలని, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య కనెక్టివిటీ తో పాటు తూర్పు నుండి పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులను కూడా చేపట్టాలని ఆయన రైలు అధికారులకు సూచించారు. అమరావతి గన్నవరంలో నూతన రైల్వే టెర్మినల్స్ నిర్మాణానికి భూమి కేటాయించాలని రైల్వే శాఖ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారు.
ఆ రైల్వే పనులు పూర్తి చెయ్యాలని ఆదేశం
శ్రీకాళహస్తి మార్గంలో పనులకు అవసరమైన 27 కోట్ల రూపాయల నిధులను తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. కోటిపల్లి నర్సాపూర్ మార్గంలో, కాకినాడ కోటిపల్లి అమలాపురం మార్గంలో రైలు సర్వీసులను నడపాలని అధికారులకు సూచించారు. గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ పనులు వేగవంతం చేయాలని, కాజీపేట విజయవాడ మధ్య మూడో లైన్ పల్లి త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
ఏపీలో ఆ రైల్వే స్టేషన్లు ఐకానిక్ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి లను ఐకానిక్ రైల్వేస్టేషన్ లు గా మార్చాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మించిన రైల్వే స్టేషన్ ను వినూత్నంగా తీర్చిదిద్దాలని, విజయవాడ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌకర్యం కోసం స్కై వాక్ నిర్మించాలని పేర్కొన్నారు.
డిసెంబర్ నాటికి అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి చెయ్యాలన్న చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద అభివృద్ధి చేస్తున్న రైల్వే ఆధునికీకరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి అన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే పరంగా జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలపైన దక్షిణ మధ్య రైల్వే జీఎం, తూర్పు కోస్తా రైల్వే జిఎం, ఇతర రైల్వే అధికారులతో పాటు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తదితరులతో సమీక్షించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications