ఏపీలో కరోనా విజృంభణ- రికవరీలకు మూడురెట్లు కొత్త కేసులు- తాజాగా 758
ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి పెరుగుతోంది. ప్రభుత్వం రోజువారీ విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లను గమనిస్తే కరోనా కేసుల్లో పెరుగుదల అర్ధమవుతోంది. అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా తక్కువగా ఉండటం అధికారుల్ని కలవరపెడుతోంది. గతంలో కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీలు ఎక్కువగా ఉండగా.. తాజాగా రికవరీలు తగ్గి కేసులు పెరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే గత 24 గంటల్లో ఏపీలో 758 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో చిత్తూరులో అత్యధికంగా 175 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 127 కేసులు, విశాఖలో 98 కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లాలో 80, అనంతపురంలో 56 కేసులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో తూర్పుగోదావరి 45, నెల్లూరులో 33, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 27, కడపలో 24, విజయనగరంలో 23, పశ్చిమగోదావరిలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనా కారణంగా రాష్ట్రంలో నలుగురు చనిపోయారు. వీరిలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖల్లో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7201కు చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8.95 లక్షలు కాగా.. కోలుకున్న వారి సంఖ్య 8.85 లక్షలుగా ఉంది. ప్రస్తుతం 3469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 231 మంది మాత్రమే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.