ఏపీ ప్రజలను బెంబేలెత్తిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. చంద్రబాబు సర్కార్ అలెర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చింది కాదని ఎప్పటినుంచో ఈ వ్యాధి ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య చికిత్సలతో ఈ వ్యాధిని ఏమవుతుందని వైద్యులు చెబుతున్నప్పటికీ ఏపీ ప్రజలలో మాత్రం జిబి సిండ్రోమ్ భయం పోవడం లేదు.
గులియన్ బారే సిండ్రోమ్ తో ప్రజల్లో ఆందోళన
నిన్న గుంటూరు జిజిహెచ్ లో గులియన్ బారే సిండ్రోమ్ తో కమలమ్మ అనే మహిళ మృతి చెందడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో తాజాగా నేడు ఉండవల్లిలోనే తన నివాసంలో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కేసుల తీవ్రత, వైద్య సదుపాయాలు చికిత్స పైన అధికారులను ఆరా తీశారు.

వైద్య శాఖాధికారులకు చంద్రబాబు ఆదేశాలు
వైద్య ఆరోగ్యశాఖ వారి లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు విశాఖ జిల్లాలో ఐదు చొప్పున కేసులు నమోదు కాగా, కాకినాడలో నాలుగు కేసులు, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కోకేసు నమోదు అయినట్లుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి విషయంలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ గా ఉండాలని దీనిని కంట్రోల్ చేయడానికి తీసుకోవలసిన చర్యలు తక్షణం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నేడు అధికారులకు సూచించారు.
ఈ వ్యాధికి చికిత్స చాలా ఖరీదన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిబి సిండ్రోమ్ గురించి మాట్లాడారు. ఈ వ్యాధి సోకిన వారికి ఐదు ఇంజక్షన్లు రోజుకు ఇవ్వవలసి ఉంటుందని, ఒక్కొక్క ఇంజక్షన్ ధర 20వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. మొత్తం ఐదు రోజులపాటు ఐదు లక్షల రూపాయల ఖరీదు చేసే ఇంజక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఇది చాలా ఖరీదైన చికిత్సన్నారు. రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఇక దీనిని ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చామని, ప్రస్తుతం జిజిహెచ్ లలో మొత్తం 7 వందల ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ఇది అంటువ్యాధి కాదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఈ సిండ్రోమ్ రోగనిరోధక వ్యవస్థ పై దాడి చేస్తుందని, ఇది సోకిన వారిలో కాళ్లు చేతులు, బలహీనపడి తిమ్మిరి, పక్షవాతం వంటి లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా తక్షణం వైద్య చికిత్సలు తీసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications