ఏపీలో దంచికొడుతున్న వర్షాలు-రాకపోకలపై తీవ్ర ప్రభావం-ప్రాజెక్టుల్లోకి వరద
ఏపీలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్ో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పలు గ్రామాలు నీటమునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొదలైన వర్షాలు ఇవాళ మరింత భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం,విశాఖ పట్నంలో నిన్న రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలోని రణస్దలంలో 125 మి.మీ, విశాఖలోని పెందుర్తిలో 110 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్ధితి.
జనజీవనంపై తీవ్ర ప్రభావం
భారీ వర్షాల ప్రభావం పలు జిల్లాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్ష ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తీర ప్రాంతాల్లో అయితే భారీగా ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లపైకి నీరు రావడంతో పలు చోట్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్టీసీ కూడా పలు సర్వీసుల్ని రద్దు చేస్తోంది. రైళ్ల రాకపోకల్ని కూడా అధికారులు నియంత్రిస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా బిక్కుబిక్కుమంటూ స్టేషన్లు, బస్టాండ్లలో ఎదురుచూడాల్సిన పరిస్ధితి.
ఇవాళ మరింత భారీ వర్షాలు
ఇవాళ కోస్తాంధ్రలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని తీర ప్రాంతాల్లో మత్సకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ఇవాళ ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
అలాగే విశాఖ, గుంటూరు, ప్రకాశంలోనూ భారీ వర్తాలు తప్పవని హెచ్చరించింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని తెలిపింది. అటు రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా స్ధానికంగా అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది.