ఇళ్ళస్థలాల పంపిణీకి ఆ భూములు ఇవ్వొద్దు ..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా హైకోర్టులో మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.
ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం దీనిపై స్టే విధించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన భూసేకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. అందులో భాగంగా రాష్ట్రంలోని మైనింగ్ భూములను ఇతర అవసరాలకు కేటాయించ కూడదని పేర్కొంది. మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నవరత్నాలు అమలు పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అందులో భాగంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ దాదాపు 25 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మొదట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించినా ఆ తరువాత అది జూలై 8 న వైయస్ జయంతి సందర్భంగా చేయడానికి పోస్ట్ పోన్ అయ్యింది.
ఆ తర్వాత మరోమారు న్యాయపరమైన సమస్యలు నేపథ్యంలో ఆగస్టు 15 న నిర్వహించాలని భావిస్తే, మరోమారు గాంధీ జయంతి నాటికి పంపిణీ చేసేలా వాయిదా వేసుకోవలసి వచ్చింది. కోర్టులో ఇళ్ల స్థలాల పంపిణీ కి సంబంధించి పలు అభ్యంతరాలతో కూడిన పిటిషన్లు దాఖలైన నేపథ్యంలోనే న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ముందుకు వెళ్లలేకపోతుంది.