జగన్, చంద్రబాబుకు మోడీ వరమిచ్చారా ? మరోసారి హీరోల్ని చేశారా ? ఆసక్తికర చర్చ!
ఏపీలో అధికారంలో వైసీపీ ఉన్నా.. టీడీపీ ఉన్నా పలు కీలక విషయాల్లో మాత్రం కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కు ఒకే విధంగా కనిపిస్తోంది. మిగతా వారికి ఎలాంటి తేడాలున్నా ఈ రెండు పార్టీల్ని వాడుకునే విషయంలో మాత్రం ప్రధానికి ఎలాంటి మోహమాటాలూ లేనట్లే కనిపిస్తోంది. అలాగే వీరిని వాడుకుంటూనే హీరోల్ని కూడా చేసేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మోడీతో జగన్, చంద్రబాబు బంధం
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో సగటు ఓటరు లేదా ప్రజల్లో చూస్తే ప్రధాని మోడీతో వైఎస్ జగన్ మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఊరికే అర్దమవుతుంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే వైఎస్ జగన్ తో సమానంగా చంద్రబాబునూ మోడీ ఆదరించే పరిస్ధితులు ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందుకు కావాల్సిందల్లా చిన్న అవసరమే. అవసరం వచ్చిందంటే చాలు వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరినీ వాడుకునే విషయంలో మోడీకి ఎలాంటి మొహమాటాలు లేవని తేల్చిచెప్పేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముర్ముకు జగన్, చంద్రబాబు మద్దతు
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రధాని మోడీ ఎంపిక చేసిన ద్రౌపదీ ముర్ముకు ఏపీలో వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరూ బేషరతుగా మద్దతిచ్చారు. దీంతో ద్రౌపదీ ముర్ముకు ఏపీలో ఉన్న అన్ని ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు పడేందుకు మార్గం సుగమమైంది. బీజేపీకి కేవలం ఒక్క రాజ్యసభ సభ్యుడు (సీఎం రమేష్) మాత్రమే ఉన్నారు. దీంతో ఆయన ఓటుతో పాటు వైసీపీ, టీడీపీ ఓట్లన్నీ ఎన్డీయే అభ్యర్ధికే పడబోతున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఇతర రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశమవుతోంది.
సామాజిక న్యాయ సంకేతం
గిరిజన మహిళ అయిన ద్రౌపదీ ముర్మును ఎంపిక చేయడం ద్వారా దేశంలోనే తొలి ఎస్టీ రాష్ట్రపతి కల సాకారం అయ్యేందుకు ప్రధాని మోడీ తొలి అడుగు వేస్తే... ఆమెకు బేషరతుగా మద్దతివ్వడం ద్వారా జగన్, చంద్రబాబు తాము కూడా సామాజిక న్యాయ హీరోలుగా అనిపించుకునే ప్రయత్నం చేశారు. ఎలాగో బీజేపీ అభ్యర్ధికి మద్దతివ్వక తప్పని పరిస్ధితుల్లో సామాజిక న్యాయం కోసమే ముర్ముకు మద్దతిచ్చినట్లు జగన్, చంద్రబాబు చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనం. దీంతో మోడీ ఆదేశాల్ని అమలు చేసిన జగన్, చంద్రబాబు.. అటు సామాజిక న్యాయ హీరోలుగా మిగిలారు.
జగన్, చంద్రబాబును మోడీ హీరోల్ని చేశారా?
ఏపీలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు గత మూడేళ్లలో ప్రధాని మోడీ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్నీ సమర్ధించారు. పార్లమెంటులో బిల్లులైనా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలైనా వీరిద్దరూ కేంద్రం నిర్ణయాలకే మద్దతిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముర్ముకు మద్దతివ్వడం ద్వారా సామాజిక న్యాయం విషయంలో వీరిద్దరినీ మోడీ హీరోల్ని చేశారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ముర్ముకు పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతివ్వని పరిస్ధితుల్లో కారణమేదైనా జగన్, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వారిద్దరికీ రాజకీయంగా కూడా ఉపయోగపడబోతోంది.