హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మరో ఐదు రోజులే..! కేంద్రం నిర్ణయంపై టెన్షన్..!
ఏపీని రెండు ముక్కలుగా 2014లో విభజించినప్పుడు అప్పటివరకూ రెండు ప్రాంతాలకూ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బందిపడకుండా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం చెబుతోంది. దీంతో ఈసారి జూన్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది. కాబట్టి తర్వాత ఏం జరగబోతోందనే టెన్షన్ ఇప్పుడు రాజకీయ పార్టీల్ని వేధిస్తోంది.

జూన్ 2న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగిసిపోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా పరిమితం కాబోతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా హైదరాబాద్ కొనసాగబోతోంది. ఇందులో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీనికి కారణం పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగడంతో కేంద్రం ప్రతిపాదన పదేళ్ల పాటు అమలైనట్లయింది. ఇప్పటికే ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక కావడం, జగన్ మూడు రాజధానులు తెచ్చినా వాటిపై సుప్రీంలో కేసు నడుస్తుండటంతో అది తేలే వరకూ దీనిపై ఎలాంటి చర్చా ఉండదు.
అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగిసిపోవడం వల్ల ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా మూలనపడటం ఖాయం. ఇన్నాళ్లూ హైదరాబాద్ అనే ఓ బంధం కారణంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కాస్తో కూస్తూ ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు పడతాయి. లేకపోతే పదేళ్ల ఆలస్యం వందేళ్లైనా కావచ్చనే చర్చ నడుస్తోంది.
మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగింపు తర్వాత ఏం జరగబోతోందనే మరో చర్చ కూడా సాగుతోంది. ఉమ్మడి రాజధానిగా ముగింపు తర్వాత హైదరాబాద్ ను మరికొంతకాలం ఇలా కొనసాగించాలనే డిమాండ్లు ఏపీలో వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయే హైదరాబాద్ పై పట్టు కోసం కేంద్ర పాలిత ప్రాంతం కావాలని కోరుకుంటోంది. ఈ ప్రతిపాదనను స్ధానికత పేరుతో ఏర్పడిన బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications