జగన్ సర్కార్కు భారీ షాక్- పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్- కారణమిదే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది పరిషత్ ఎన్నికలకు జారీ అయిన నోటిఫికేషన్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ఎస్ఈసీ నీలం సాహ్నీ సాయంతో ముందుకెళ్లేందుకు జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎల్లుండి జరగాల్సిన ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ కాలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో ఎల్లుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. గతేడాది మార్చిలో ఇచ్చిన పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నీలం సాహ్నీ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లిన నీలం సాహ్నీకి ఇప్పుడు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలపై స్టే ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘనే
స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడినప్పుడు తిరిగి నోటిఫికేషన్ ఇచ్చాక కనీసం నాలుగు వారాల గడువు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే వీటిని లెక్కచేయకుండా ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్ఈసీ నీలం సాహ్నీ 8న ఎన్నికల పోలింగ్కు సిద్ధమయ్యారు. దీనిపై కూడా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా ఆమె వీటిని పట్టించుకోలేదు. దీంతో ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి విపక్షాలు తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది.
సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీలుకు సర్కార్, ఎస్ఈసీ ?
పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ నీలం సాహ్నీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశం ఉంది. విపక్షాల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు.. ఎస్ఈసీ పనితీరులో జోక్యంగా ప్రభుత్వం పేర్కొనే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ కూడా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రేపటి లోగా ఈ స్టేను తొలగిస్తేనే ఎన్నికల నిర్వహణకు వీలవుతుంది.