ఇంకా వైసీపీ గుప్పిట్లోనే ఆ ఐపీఎస్ లు ? డీజీపీ మెమో వెనుక ఇంటెల్ రిపోర్ట్..!
ఏపీలో తాజా ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. అంతే కాదు వీరిలో వైసీపీ సానుభూతిపరులుగా ఉంటూ గత ఐదేళ్ల ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించిన వారికి పోస్టింగ్ లు సైతం ఇవ్వలేదు. అయితే ఇందులో కొందరు అధికారులు వైసీపీకి ఇప్పటికీ సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు తాజాగా తేల్చాయి. అందుకే వీరిపై ప్రభుత్వం తదుపరి చర్యలకు దిగింది.
తాజాగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు 16 మంది టాప్ ఐపీఎస్ అధికారులకు మెమోలు జారీ చేశారు. వీరు డీజీపీ ఆఫీసు పరిధిలో ఉన్నందున రోజూ కార్యాలయానికి వచ్చి హాజరు నమోదు చేసి సాయంత్రం వరకూ ఉండి వెళ్లాలనేది ఈ మెమోల సారాంశం. అయితే ప్రభుత్వం వీరిపై ఇంత తీవ్ర చర్యలకు ఎందుకు దిగిందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో నిఘా వర్గాలు వీరిపై ఇచ్చిన నివేదిక కీలకంగా మారినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పలువురు వైసీపీ నేతలపై చర్యలకు దిగుతోంది. అలాగే పలువురు వైసీపీ అనుకూల అధికారులపైనా కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసుల్ని నీరుగార్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. పలు కేసుల్లో విచారణను తూతూమంత్రంగా ముగించేలా వీరు తమ తోటి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు నిఘా వర్గాలు తేల్చినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై వీరికి మెమోలు పంపింది.
వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు పెద్దలపై కఠిన చర్యలు లేకుండా చూసేందుకు కూడా వీరు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పాటు అప్పటి వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా లేకుండా చూసుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తేల్చారు. దీంతో ఆయా అధికారులకు మెమోలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications