జగన్ ఎన్నికల యుద్దభేరీ : తటస్థులు..కార్యకర్తలతో సమావేశం : తిరుపతి వేదికగా ప్రారంభం..!
వచ్చే ఎన్నికల కోసం వైసిపి అధినేత జగన్ శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించను న్నారు. పాదయాత్ర తరువాత ప్రజల్లోకి వస్తున్నారు. తటస్థులను ఆకట్టుకోవటంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్ పైనే ఈ సమావేశాల్లో దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుపతి వేదికగా ఎన్నికల భేరీ..
తిరుపతి వేదికగా వైసిపి అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. సమరశంఖారావం పేరుతో అన్ని జిల్లాల్లోనూ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి చెందిన కార్యకర్తలు..బూత్ లెవల్ కమిటీ ప్రతినిధులు ఈ స మావేశానికి హాజరు కానున్నారు. తిరుపతి సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. సమావేశానికి దాదాపు 40 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం నుండి దాదాపు 2500 మంది చొప్పు న పార్టీ బూత్ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు సమావేశానికి వస్తారని చెప్పారు. వీరందరినీ ఎన్నికలకు సన్నద్ధం చేయడం, వైకాపా ఎన్నికల హామీలను ప్రకటించడం, ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలు, బూత్కమిటీల ప్రతినిధులు అమలు చేయాల్సిన వ్యూహాలపై జగన్ వివరిస్తారు. జిల్లాలో అసెంబ్లీ - లోక్సభ నియోజకవర్గాల సమన్వయ కర్తలు ఈ సమావేశానికి హాజరవుతారు.

తటస్ధులతో ప్రత్యేకంగా...
ఈ సారి ఎన్నికల్లో ఏ వర్గానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా..తటస్థులను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా..తొలి సమావే వం తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీ నేతలు గుర్తించారు. వారికి జగన్ నేరుగా లేఖలు రాసారు. సమావేశానికి రావాలని ఆహ్వానించారు. వారితో సమావేశం సమయం లో వారి నుండి అభిప్రాయాలు సేకరించి..వాటిని అమలు కోసం ఏ రకంగా ముందుకు వెళ్లేది జగన్ వివరించనున్నారు . ఇదే సమయంలో..కొన్ని చోట్ల ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వటం పైనా జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సమావేశాల ద్వారా తటస్థుల మద్దతు పొందటానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. 7న కడపలో, 11న అనంత పురంలో, 13న ప్రకాశం జిల్లాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications