న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్న్యూస్
డిసెంబర్ 31 రానేవచ్చింది. 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని అందరూ తెగ ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కరోనా కేసులు పెరగడం ఒక్కసారిగా అందరి ఆశల మీద నీళ్లు పోసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి కరోనా కేసుల తీవ్రత ఉన్న చోట న్యూ ఇయర్ వేడుకలను నిషేధించారు. పలు రాష్ట్రాల్లో పార్టీలు, ఈవెంట్స్ పై కఠిన ఆంక్షలు విధించారు.
కరోనా కేసులతో ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల క్రమంలో డిసెంబర్ 31 వతేదీ రాత్రి గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చేసుకునే పార్టీల పరిస్థితి ఏమిటి అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది.మద్యం విక్రయాల సమయాన్ని గంట సేపు పొడిగించి మద్యం షాపులు, బార్ లకు కాస్త వెసులుబాటు కల్పించింది.
రాష్ట్రంలోని బార్లు, రిటైల్ మద్యం దుకాణాలు, ఇన్ హౌస్ లలో మద్యం విక్రయాల సమయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఈవెంట్స్ తోపాటుగా, పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లలో విక్రయానికి అనుమతిస్తున్నట్లుగా ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లు డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీఎస్బీసీఎల్ ఎండి నుండి అన్ని మద్యం డిపోల మేనేజర్లకు ఆదేశాలందాయి. సాధారణంగా రోజువారీగా రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు, 11 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు జరుగుతాయి కానీ, నూతన సంవత్సర వేడుకల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి పది గంటల వరకు, బార్లు రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలను నిర్వహించుకోవచ్చు.